దాచాల్సిన అవసరం మాకేం లేదు: కోల్ స్కాంపై ప్రధాని
న్యూఢిల్లీ: కోల్ స్కాంకు సంబంధించిన డాక్యుమెంట్లను ప్రభుత్వం దాచిపెట్టిందన్న విమర్శలపై ప్రధాని మన్మోహన్ సింగ్ స్పందించారు. ఆయన మంగళవారం రాజ్యసభలో దీనిపై వివరణ ఇస్తూ..కోల్ స్కాంకు సంబంధించిన డాక్యుమెంట్లను దాచాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.
కోల్ స్కాంకు సంబంధించిన పలు డాక్యుమెంట్లను సీబీఐకి అందించినట్లు ప్రధాని తెలిపారు. డాక్యుమెంట్ల గల్లంతును ప్రభుత్వం తీవ్రంగా పరిగణించిందని చెప్పారు. సభలో ప్రతిపక్షాల ఆందోళనలకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సీబీఐకి ఇప్పటికే కోల్ స్కాంకు సంబంధించిన లక్షకు పైగా డాక్యుమెంట్లను అందించామని చెప్పారు. ఈ అంశానికి సంబంధించి సమాచారాన్ని దాచాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదన్నారు. డాక్యుమెంట్లపై విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. డాక్యుమెంట్ల గల్లంతు నిజమని రుజువైతే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.
కాగా కోల్ స్కాం డాక్యుమెంట్ల గల్లంతుపై ప్రధాని మన్మోహన్ బాధ్యత వహించాలని భారతీయ జనతా పార్టీ సభ్యులు డిమాండ్ చేశారు. డాక్యుమెంట్ల గల్లంతుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి.