సరేనని వ్యతిరేకత ఎక్కడిది? బాబు మంచి ఫ్రెండ్: డిగ్గీ
ఆంటోని కమిటీని ఎవరైనా కలిసి తమ తమ అభిప్రాయాలు చెప్పుకోవచ్చునని అన్నారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన అన్ని అంశాలను ఆంటోని కమిటీ చూస్తోందన్నారు. విభజనకు అన్ని పార్టీలు ఒప్పుకున్నాయని, అలాంటప్పుడు మళ్లీ వ్యతిరేకత ఎక్కడిదని ప్రతిపక్షాల వ్యాఖ్యలను ఉద్దేశించి అన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా చేసే విషయం తనకు తెలియదని చెప్పారు. ఇప్పుడే ఏ విషయం చెప్పలేనన్నారు. విభజనకు సంబంధించి వివాదమేమీ ఉండదన్నారు.
ఆంటోని కమిటీ అన్ని వర్గాల వారి వాదనలు విని సిఫారసు చేస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల పైన తాను స్పందించనని అన్నారు. చంద్రబాబు తనకు మంచి మిత్రుడు అన్నారు.
కాగా, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అంతకుముందు డిగ్గీని కలిశారు. ఆయనతో అరగంట పాటు భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులను వివరించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయన ఆంటోని కమిటీని కలుస్తారు.
ప్రధానిని కలిసిన టి ఎంపీలు
తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ఎంపీలు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ను కలిశారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ఎంపీలు విభజన ప్రక్రియ వేగవంతం చేయాలని మరికొందరు ఢిల్లీ పెద్దలను కలువనున్నారు.