ఒక్కరోజులో ఈ మార్పేంటి?: కెకె, 19 షరతులతో సభ
హైదరాబాద్: ఈ నెల 10వ తేది వరకు ర్యాలీలకు, ధర్నాలకు, ఆందోళనలకు అనుమతి లేదని రెండు రోజుల క్రితం చెప్పిన హైదరాబాద్ కమిషనర్ అనురాగ్ శర్మ ఒక్కరోజులోనే ఎందుకు మాట మార్చారని తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత కె కేశవ రావు బుధవారం ప్రశ్నించారు. ఈ ఒక్క రోజులోనే సభకు అనుమతి ఇవ్వడం వెనుక ఏం జరిగిందో చెప్పాలన్నారు. ఈ కుట్రలన్నింటికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డే సూత్రధారి అని ఆరోపించారు. సభలో ఏమైనా జరిగితే బాధ్యత ఎవరిదన్నారు.
7వ తేదిన ఎపిఎన్జీవోల సభ జరిగితే తదనంతర పరిణామాలపై ప్రభుత్వం ఆలోచించాలన్నారు. సభ పేరుతో తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టవద్దని కోరారు. పుండు మీద కారం చల్లేలా సభను పెట్టుకుంటున్నారని, అసలు సభనే చట్ట విరుద్ధమన్నారు. హైదరాబాదు పైన అనవసర రాజకీయం చేయవద్దని హితవు పలికారు. 13 ఏళ్లు తెలంగాణ ఉద్యమం, తెరాస ప్రశాంతంగా జరిగిందన్నారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయి అన్నదమ్ముల్లా కలిసుందామన్నారు.

ద్వంద్వ వైఖరి: జానా రెడ్డి
విభజన విషయంలో కొన్ని పార్టీలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయన్నారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు విభజనకు అనుకూలంగా లేఖలు ఇచ్చి ఇప్పుడు యూ టర్న్ తీసుకోవడమేమిటని ప్రశ్నించారు. సీమాంధ్రులు తమ సమస్యలను ఆంటోని కమిటికీ వివరించకుండా ఆందోళనలు చేయడం సరికాదన్నారు. తెలంగాణ ప్రజలు, ఉద్యోగులు సంయనం పాటిస్తున్నారన్నారు. ఒక్కరోజే ఎపిఎన్జీవోల సభ, తెలంగాణవాదుల శాంతి సభ సరికాదన్నారు. సభలకు అనుమతి ఇవ్వకపోవడమే మంచిదన్నారు. పోటీ పడి సభలు నిర్వహించడం ఏమాత్రం వాంఛనీయం కాదన్నారు.
షరతులతో ఎపిఎన్జీవో సభకు అనుమతి
ఎపిఎన్జీవో సభకు పోలీసులు 19 షరతులతో అనుమతించారు. ఎల్బీ స్టేడియం కెపాసిటీ 15 వేలు మాత్రమేనని, అంతకుమించి రావొద్దని డిసిపి కమలాకర్ రెడ్డి చెప్పారు. ర్యాలీలు, నినాదాలపై నిషేదం విధించారు. సభలో ఎవరినీ రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేయవద్దు. ఎవరి మనోభావాలు కించపర్చవద్దు. ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తులను ధ్వంసం చేస్తే ఖఠిన చర్యలు. కాగా, సభకు అసాంఘిక శక్తులు వచ్చే అవకాశముందని పోలీసులు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications