హైదరాబాద్ యుటి: కిరణ్ వ్యతిరేకత, అసద్ హెచ్చరిక
యుటి చేస్తే దాని వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదని ముఖ్యమంత్రి అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో సీమాంధ్ర నేతలతో భేటీ సందర్భంగా ఈ విషయమై చర్చకు వచ్చినప్పుడు కిరణ్ సహా ఎవరూ అంగీకరించలేదని సమాచారం. హైదరాబాద్కు రెండు వైపులా 200 కిలో మీటర్లకు పైగా దూరంలో సీమాంధ్ర ప్రాంతాలు ఉండగా, నగరాన్ని యుటిగా ఎలా చేస్తారని కాంగ్రెస్ ఎంపి వి హనుమంత రావు ఢిల్లీలో ప్రశ్నించారు.
యుటి ప్రచారం ఊహాజనితమేనని మాజీమంత్రి జీవన్ రెడ్డి హైదరాబాద్లో అన్నారు. ఈ ప్రతిపాదనపై అసలు హైదరాబాద్ వాసుల మనస్థితే వేరుగా ఉంటుందని మంత్రి దానం నాగేందర్ చెప్పారు. కేంద్రం హైదరాబాద్ను యుటి చేస్తే కనీవినీ ఎరుగని రీతిలో ప్రతిఘటన తప్పదని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ హెచ్చరించారు. ఇది రెండు ప్రాంతాల ప్రజలకూ నష్టమేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. అలా ప్రకటించడం సమస్యకు పరిష్కారం కాబోదన్నారు.
నగరం పది జిల్లాల రాష్ట్రానికి రాజధానిగా ఉండాలని మాత్రమే బిజెపి కోరుకుంటున్నదని ఆ పార్టీ ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి చెప్పారు. నగరాన్ని యుటి చేయడం ప్రజల భాగస్వామ్యాన్ని రద్దు చేయడమేనని, దీనిపై మరో ఉద్యమానికి సన్నద్ధమవుతామని టిఎన్జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్ స్పష్టం చేశారు. సీమాంధ్రుల ఒత్తిడికి తలొగ్గి హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు కూడా పడకుండా గుణపాఠం చెబుతామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ హెచ్చరించారు.
హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని జీవన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ లేకుండా తెలంగాణ లేదన్నారు. హైదరాబాద్ లేని తెలంగాణను ఈ ప్రాంత ప్రజలెవరూ అంగీకరించబోరని చెప్పారు. ఇప్పటికే పలు కేంద్ర పాలిత ప్రాంతాలను ఉపసంహరించుకోవాలన్న అభిప్రాయంతో కేంద్రం ఉన్న తరుణంలో హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా ఎలా ప్రకటిస్తుందని ప్రశ్నించారు. ఇదంతా తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలు చేస్తోన్న కుట్రలో భాగమని అన్నారు.