నేనైతే రాజీనామా చేసేవాడ్ని: కిరణ్పై కిశోర్ చంద్రదేవ్
రాష్ట్ర విభజనపై నిర్ణయం జరిగిపోయిందని, అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేసినా ప్రయోజనం ఉండదని ఆయన అన్నారు. ఇప్పుడు కేంద్రమంత్రులు రాజీనామాలు చేసినందువల్ల ఒరిగేదేమిలేదని అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, పిసిసి అధ్యక్షుడు తమ పదవులకు రాజీనామాలు చేయాలని అన్నారు.
రాష్ట్ర విభజనకు సిపిఎం, మజ్లీస్ తప్ప మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు సమ్మతి తెలిపాయని కిషోర్ చంద్రదేవ్ అన్నారు. విభజన జరిగితే వచ్చే సమస్యలు ముందే అధిష్టానం దృష్టికి తీసుకు రావాల్సిందని ఆయన అన్నారు. హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం (యుటీ) చేస్తే ఎప్పుడో సమస్య సద్దు మణిగేదని ఆయన అన్నారు. ఇదే విషయాన్ని రెండేళ్ళ కిందటే తాను సూచించానని, దీనిపై ఎవరూ స్పందించలేదని, మాట్లాడలేదని కిషోర్ చంద్రదేవ్ అన్నారు.
ముప్ఫై ఏళ్లుగా రాజకీయ అనుభవం ఉన్న తాను ఎప్పుడూ బెదిరింపు రాజకీయాలకు పాల్పడలేదని, పాల్పడనని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో రెండో అతి పెద్ద నగరం విశాఖపట్టణమేనని, ఆంధ్రాకు విశాఖ రాజధాని చేయాలని ఆయన సూచించారు. రాష్ట్ర విభజనపై తన అభిప్రాయం, అనంతరం వచ్చే సమస్యలపై తాను అధిష్టానానికి రెండు లేఖలను ఇచ్చానని, అవి చదివితో అన్ని విషయాలు అర్థమవుతాయని ఆయన అన్నారు.