ఉత్తరాఖండ్: బయటపడిన మరో 64 మృతదేహాలు
ఉత్తరాఖండ్: రాష్ట్రం ఇంకా వరద బీభత్స విషాద ఛాయల నుంచి బయటపడలేదు. కేదార్ నాథ్ మృతుల కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం వాతావరణం అనుకూలించడంతో కేదార్ నాథ్ వరదల్లో గల్లంతైన వారి మృతదేహాలను గుర్తించేందుకు భద్రతా దళాలు చర్యలు చేపట్టాయి. కేదార్ నాథ్ కొండల్లో చిక్కుకున్న మరో 64 మృతదేహాలను వెలికితీసినట్లు గురువారం సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు.
మృతులు కేదార్ నాథ్ దర్శనానికి వచ్చిన భక్తులుగా గుర్తించినట్లు తెలిపారు. జూన్ లో వచ్చిన వరదల నుంచి తమను కాపాడుకునేందుకు కొండపైకి ఎక్కినట్లు తెలుస్తోందని చెప్పారు. అక్కడ తీవ్రమైన చలిని తట్టుకోలేక మృతి చెందినట్లు ఐజీఆర్ఎస్ మీనా తెలిపారు. 64 మృతదేహాలకు దహన సంస్కారాలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.
వాతావరణం అనుకూలించని కారణంగా ఇంతకాలం గాలింపు చర్యలు నిలిపివేసినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం వాతావరణం పూర్తిగా అనుకూలంగా ఉందని, ఇలాగే మరికొన్ని రోజులు ఉంటే గాలింపు చర్యలు కొనసాగిస్తామని ఆయన చెప్పారు. రాంబాడ, గౌరీగోన్, భీంబాలి ప్రాంతాల్లో మరికొన్ని మృతదేహాలు ఉండే అవకాశం ఉందని మీనా తెలిపారు.
ప్రస్తుతం భూ ఉపరితలంపై ఉన్న మృతదేహాలను గుర్తిస్తున్నామని, భూమిలో కూరుకుపోయిన మృతదేహాల కోసం కూడా గాలింపు చర్యలు చేపడతామని తెలిపారు. డీజీపీ సత్యవ్రత్ భన్సల్ సెప్టెంబర్ 11న కేదార్ నాథ్ లో పర్యటించి పరిస్థితిని సమీక్షిస్తారని మీనా తెలిపారు. 30మంది పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చేపడ్తున్నట్లు ఆయన తెలిపారు.
కాగా రాష్రంలో రానున్న 24గంటల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఒకరు చెప్పారు. ఉత్తరకాశీ, మున్సారిలలో అత్యధికంగా 35మి.మీ, 28మి.మీ వర్షపాతం నమోదైనట్లు తెలిపారు.