అన్ని పార్టీలూ తప్పు చేశాయి: విభజనపై అనంత
అన్నదమ్ముల్లా విడిపోదామని అంటున్నవాళ్లు, అన్నదమ్ముల్లా కలిసి ఉందామంటున్నవాళ్లు తెలంగాణ బంద్కు పిలుపునివ్వడాన్ని తాను ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ 24 గంటల బంద్కు ఇచ్చిన పిలుపును ఉపసంహరించుకోవాలని ఆయన తెలంగాణ జెఎసికి సూచించారు. తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ను ఏ రోజు కూడా అడ్డుకోలేదని ఆయన చెప్పారు. హైకోర్టుల తమ ప్రాంత న్యాయవాదులను చితకబాదారని, ఇది సరైంది కాదని ఆయన అన్నారు.
రాష్ట్రం విడిపోతే తమ ప్రాంతానికి నీరు రాదని, ఈ విషయంలో తాము ఆందోళన చెందుతున్నామని ఆయన చెప్పారు. ఏ పరిస్థితిలోనూ రాష్ట్రం విడిపోకూడనది తాము కోరుకుంటున్నట్లు తెలిపారు. హైదరాబాద్ విషయంలో తమ వాటా తమకు దక్కే వరకు ఊరుకోబోమని ఆయన అన్నారు. తన మాటే ఫైనల్ అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఇప్పుడు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. విభజనకు లేఖలు ఇచ్చిన వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ఇప్పుడు యాత్రల పేర్లతో నాటకాలు ఆడుతున్నాయని ఆయన అన్నారు.
విభజన నిర్ణయంపై పునరాలోచన చేయాలని తాము పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లుగానే టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల నాయకులు తమ నాయకత్వాలపై నిర్ణయం వెనక్కి తీసుకునేలా ఒత్తిడి తేవాలని ఆయన డిమాండ్ చేశారు. పార్లమెంటులో తమ వాదన వినిపించుకున్నప్పుడు తాము తెలంగాణ ఎంపిలను అభ్యంతర పెట్టలేదని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెసు సీమాంధ్ర ఎంపిలమంతా ఒక్కటిగానే ఉన్నామని చెప్పారు.