చంద్రబాబు పుట్టుక అంటూ షర్మిల కామెంట్: రోజా ఫైర్
కర్నూలు/చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలుగు గడ్డ మీద పుట్టినందుకు తెలుగు తల్లే అవమానంతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత షర్మిల శుక్రవారం మండిపడ్డారు. చంద్రబాబు ఏ ముఖం పెట్టుకొని తెలుగు జాతి ఆత్మగౌరవం పేరుతో యాత్ర చేస్తన్నారని ప్రశ్నించారు.
షర్మిల సమైక్య శంఖారావం శుక్రవారం ఆరో రోజుకు చేరుకుంది ఆమె కర్నూలు జిల్లా నంద్యాలలో ప్రసంగించారు. ఈ సందర్భంగా బాబు పైన నిప్పులు చెరిగారు. ఆయన పట్టపగలే సీమాంధ్రుల గొంతు కోశారన్నారు. సీమాంధ్ర ప్రజలు సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబును సీమాంధ్ర ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.
మా ఏకైక అజెండా సమైక్యాంధ్ర: శ్రీకాంత్ రెడ్డి
షర్మిల యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. తమ ఏకైక అజెండా సమైక్యాంధ్ర అన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు సీమాంధ్ర ప్రజలను మోసం చేస్తున్నాయని, మోసం చేయాలనుకుంటే అది బయటకు చెప్పాలన్నారు.
సోనియా, బాబుల మధ్య చీకటి ఒప్పందం: రోజా
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడుల మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు రోజు చిత్తూరు జిల్లాలో అన్నారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన బాబుకు సీమాంధ్రలో తిరిగే హక్కు లేదన్నారు. లేఖ వెనక్కి తీసుకోని యాత్ర చేపట్టాలన్నారు. సమైక్యాంధ్రకు మద్దతు తెలపకుంటే బాబును తిరగనివ్వమని ప్రవీణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెసు, టిడిపిలతో ఓట్లు సీట్ల సిద్ధాంతమని అమర్నాథ్ రెడ్డి ఆరోపించారు.
8న నెల్లూరులో షర్మిల యాత్ర: మేకపాటి
ఈ నెల 8వ తేదిన షర్మిల యాత్ర నెల్లూరులో ఉంటుందని ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పారు.