దోస్తీ: ఉభయ కమ్యూనిస్టులు చెట్టాపట్టాల్
హైదరాబాద్: రాష్ట్రంలోని ఉభయ కమ్యూనిస్టుల మధ్య నెలకొన్న విభేదాలు దాదాపుగా సమసిపోయాయి. రాష్ట్ర విభజన అంశంపై సిపిఐ, సిపిఎం మధ్య విభేదాలు నెలకొన్నాయి. సిపిఐ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థించగా, సిపిఎం వ్యతిరేకిస్తోంది. దీంతో ఇరు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. ఉమ్మడి కార్యక్రమాల నిర్వహణ ఆవశ్యకతే వాటిని తిరిగి ఏకం చేసినట్లు చెబుతున్నారు.
రాష్ట్ర విభజన విషయంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు, ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ గతంలో తీవ్రంగా మండిపడ్డారు. నారాయణ విమర్శలకు ప్రతిగా రాఘవులు లేఖాస్త్రం కూడా సంధించారు. కమ్యూనిస్టుల మధ్య విభేదాలు సరి కావనే అభిప్రాయం వ్యక్తమైంది.ఈ నేపథ్యంలో సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్లో ఆదివారం నాడు ఇరు పార్టీల రాష్ట్ర స్థాయి నేతల సమావేశం జరిగింది.
ఆ సమావేశంతో ఇరు పార్టీల మధ్య విభేదాలు పూర్తిగా సద్దుమణిగిందన్న సంకేతం ఇచ్చినట్లు అయిందని అంటున్నారు. కాగా, భవిష్యత్ కార్యక్రమాలపై జరిగిన ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ, సిపిఎం రాష్టర్ కార్యదర్శి రాఘవులు పాల్గొన్నారు.
వారితో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అజీజ్పాషా, జల్లి విల్సన్, రామకృష్ణ, సిద్ది వెంకటేశ్వర్లు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వై వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు. ఈ నెల 17న తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాన్ని నిర్వహించాలని, జాతీయ స్థాయిలో వామపక్షాలు ప్రతిపాదించిన విధాన ప్రత్యామ్నాయాన్ని ప్రజల్లోకి తీసుకుపోయేందుకు అక్టోబర్ తొలివారంలో హైదరాబాద్లో బహిరంగ సభ నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
ఇక ఈ సమావేశం వివరాలను పార్టీ గ్రేటర్ హైదరాబాద్ కార్యవర్గ సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా తమ ఇరు పార్టీల మధ్య కొట్లాట కొట్లాటే.. స్నేహం స్నేహమేనని నారాయణ అన్నారు. రాజకీయ పార్టీలన్నాక విభేదాలుంటాయని, బహిరంగ చర్చల ద్వారా అవి పరిష్కారమవుతాయని ఆయన అన్నారు.