గబ్బర్ సింగ్లా బెల్టు, స్టార్ బ్యాట్స్మన్: లగడపాటి
నిర్దాక్షిణ్యంగా తెలుగు తల్లిపైవేటు వేసేయండంటున్నారని, అలాంటి నేతల మాటలు చెల్లుబాటు కాకుండా చేస్తామని, వారి పేర్లను సరైన సమయంలో బయటపెడుతానని, వారి ప్రయత్నాలను వమ్ము చేస్తామని ఆయన అన్నారు. ప్రజల బాధలు గ్రహించకుండా పదవే పరమావధిగా వ్యవహరిస్తున్నవారికి ఏపీఎన్జీవోల సభ కనువిప్పు కావాలని హితవు పలికారు. తాము బహిరంగ యుద్ధం చేస్తుండగా, వారు ముసుగులో యుద్ధం చేస్తున్నారని, అంతిమ విజయం తమదేనన్న ధీమాతో ఉన్నారని ఆయన అన్నారు. ఉపాధ్యాయునిగా ఉన్న తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరాం సంకుచిత భావంతో ఎపిఎన్జీవోల సభకు అడ్డుతగిలారని ఆరోపించారు.
స్టార్ బ్యాట్స్మన్ (ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి) ప్రతిభతోనే సభ సక్సెస్ అయిందని, లక్షల మంది ఆయన వెనుక ఉన్నారని లగడపాటి చెప్పారు. "మీటింగ్ పెడితే బంద్ చేస్తారా? పోలీసు యం త్రాంగం ఇలాంటి వారిపై గబ్బర్సింగ్ లా బెల్టు తీయాలి. ఎవరైనా విద్వేషాలు రగిల్చినా, ప్రజల మధ్య చిచ్చుపెట్టినా, కుల, మత, ప్రాంత విద్వేషాలు రగిల్చినా పోలీసులు గబ్బర్సింగ్లా తయారు కావాలి'' అని వ్యాఖ్యానించారు.
విభజనపై ముందుకు వెళుతున్నామన్న కేంద్ర హోం మంత్రి షిండే ప్రకటనపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ముందుకెళ్లాలో, వెనక్కెళ్లాలో తెలియని పరిస్థితిలో కేంద్రం ఉందన్నారు. హైదరాబాద్ లేని ఏ రాష్ట్రమైనా ఎడారవుతుందన్నారు. కర్నూలు రాజధాని అయి ఉంటే హైదరాబాద్ కంటే ఎక్కు వ అభివృద్ధి చెందేదని వివరించారు.
పార్టీలు, ప్రభుత్వాలతో నిమిత్తం లేకుండా సమైక్య భావన బలపడిందని, ప్రజల భావన బయటకొచ్చిన తర్వాత అన్నీ పార్టీలు మనస్సు మార్చుకున్నాయని, ప్రజాస్వామ్యంలో ప్రజా శాసనానికి తలొగ్గాల్సిందేనని ఆయన అన్నారు. సమైక్యత కోసం దేనికీ వెనుకాడే పరిస్థి తి లేదు. విభజనపై కేంద్రం అడుగు ముందుకేస్తే మా ప్రయత్నాలు మరో రకంగా ఉంటాయని, ఏ ఎత్తుగడతోనైనా సమైక్యాంధ్రను కాపాడుకుంటామని తెలిపారు.