ఓవరాక్షన్ యాక్టర్లు: సిఎం, బొత్సలపై షర్మిల (ఫొటోలు)
నెల్లూరు: రాష్ట్ర విభజనపై కాంగ్రెసు పార్టీ వేసిన ఎకె ఆంటోనీ కమిటీపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సోదరి వైయస్ షర్మిల మండిపడ్డారు. రాష్ట్రమంతా అట్డుడికిపోతుంటే కోట్ల మంది గుండెలు రగిలిపోతుంటే అదేదో సొంత పార్టీ వ్యవహారమన్నట్లు కాంగ్రెసు పార్టీ ఓ సొంత పార్టీ కమిటీని వేసిందని ఆమె ఆంటోనీ కమిటీపై వీరుచుకుపడ్డారు. ఆ కమిటీలో కేరళకు చెందిన ఆంటోనీ, కర్ణాటకకు చెందిన వీరప్ప మొయిలీ, తమిళనాడుకు చెందిన చిదంబరం, మధ్యప్రదేశ్కు చెందిన దిగ్విజయ్ సింగ్, గుజరాత్కు చెందిన అహ్మద్ పటేల్ ఉన్నారని, ఒక్క తెలుగువాడు కూడా లేదని ఆమె అన్నారు.
ఆదివారంనాడు ఆమె సమైక్య శంఖారావం బస్సు యాత్ర నెల్లూరు జిల్లాలో సాగింది. ఆంటోనీ కమిటీ అంతా ఒక తోలుబొమ్మ ఆట అని ఆమె వ్యాఖ్యానించారు ఈ కమిటీకి సంబంధం లేకుండానే విభజన బిల్లు తయారవుతోందని, కేబినెట్ ఆమోదం కూడా పొందుతుందని షిండే అంటున్నారని, అంటే ఈ కమిటీ అభిప్రాయాలు సేకరించడం పెద్ద డ్రామా అని ఆమె అన్నారు. ఈ డ్రామాలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు ఓవరాక్షన్ చేసే యాక్టర్లని ఆమె అన్నారు.
రాష్ట్రంలో 8 కోట్ల జనాభా ఉంటే, ఐదు కోట్ల మంది సీమాంధ్రులేనని, ఇంత మందికి అన్యాయం జరుగుతుంటే కాంగ్రెసు పార్టీ కాలర్ పట్టుకుని నిలదీయాల్సిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడులో మటుకు చలనం లేదని ఆమె అన్నారు. అసలు విభజనకు కారణమే చంద్రబాబు అని ఆమె అన్నారు. తెలంగాణ ఇచ్చేయండంటూ ఓ బ్లాంక్ చెక్కులా చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని షర్మిల అన్నారు.
సొంత వ్యవహారమా..
విభజనను కాంగ్రెసు తన సొంత వ్యవహారంలా చూస్తోందని షర్మిల విమర్శించారు. ఆంటోనీ కమిటీలో తెలుగువారే లేరని, అలాంటప్పుడు తెలుగువారి మనోభావాలు కమిటీకి ఎలా తెలుస్తాయని ఆమె అడిగారు.
ఆంటోనీ డ్రామా కంపెనీ
ఆంటోనీ కమిటీతో సంబంధం లేకుండా నే విభజన బిల్లు తయారవుతోందని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారంటే ఆ కమిటీ ఓ పెద్ద డ్రామా కమిటీ అన్న మాట అని షర్మిల వ్యాఖ్యానించారు. అందులో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ,త మంత్రులు క్యారెక్టర్ లేని యాక్టర్లు అని ఆమె వ్యాఖ్యానించారు.
ఇప్పుడే దాడులు చేస్తున్నారు..
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు ఇప్పుడు సీమాంధ్రులపై దాడులు చేస్తున్నారని, ఇక విభజన అంటూ జరిగితే హైదరాబాదులో బతకనిస్తారా అని షర్మిల అన్నారు.
చంద్రబాబుపై ధ్వజం
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై ఆమె తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెసు విభజనకు యత్నిస్తుంటే చంద్రబాబు వంత పాడుతున్నారని ఆమె ఆరోపించారు. చంద్రబాబు తన లేఖను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబును నిలదీయండి..
తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకుని, రాజీనామా చేసేంత వరకు చంద్రబాబును నిలదీయాలని షర్మిల ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారంనాడు షర్మిల కడప, నెల్లూరు జిల్లాల్లో పర్యటించారు.
ఐదు పార్టీలు సై
రాష్ట్ర విభజనకు ఐదు పార్టీలు సై అంటున్నాయని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, మజ్లీస్, సిపిఎం మాత్రమే సమైక్యంగా ఉండాలని అంటున్నాయని షర్మిల అన్నారు.