సిఎం ప్రోత్సాహంతోనే, బాధ్యత ఆయనదే: కోదండరాం
హైదరాబాద్: ఈ నెల 14న తెలంగాణ జేఏసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు ఛైర్మన్ కోదండరాం తెలిపారు. తెలంగాణ జేఏసీ కార్యాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్టాడారు. హైదరాబాద్లో జరిగిన ఏపీ ఎన్జీవోల సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ సమయంలో జరిగిన ఘర్షణకు ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి బాధ్యత వహించాలని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి ప్రోత్సాహంతోనే సభ జరిగిందని ఆయన చెప్పారు. సీమాంధ్రలో 19 భారతీయ జనతా పార్టీ, 4 సీపీఐ పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడులను ఆయన ఖండించారు. తెలంగాణకు మద్దతు ప్రకటించినందుకే పార్టీల కార్యాలయాలపై దాడులు జరుగుతున్నాయన్నారు. సెప్టెంబర్ 30న హైదరాబాద్లో సభ నిర్వహించాలని ప్రతిపాదనలు వచ్చినట్లు కోదండరాం తెలిపారు.
తెలంగాణ ఉద్యమం మరింత ఉధృతం కాకముందే కేంద్రం పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టి వెంటనే ఆమోదించాలని కోదండరాం డిమాండ్ చేశారు.
దాడులు చేయడమే సమైక్యమా?: దేవిప్రసాద్
జై తెలంగాణ అంటే దాడులకు దిగుతారా.. సమైక్యమంటే ఇదేనా? అని టీఎన్జీవో అధ్యక్షుడు దేవిప్రసాద్ ప్రశ్నించారు. హైదరాబాద్ నడిబొడ్డున సీమాంధ్రులు సమైక్యాంధ్ర అన్నా తాము దాడులకు పాల్పడలేదని, జై తెలంగాణ అన్న ఒక్క పోలీస్ కానిస్టేబుల్ పై దాడి చేయడం ఏ విధంగా సమర్థనీయమన్నారు.
సీమాంధ్ర ఉద్యోగుల సమస్యలు చర్చించుకుంటే పరిష్కారమయ్యేవేనని ఆయన అన్నారు. హైదరాబాద్ లో సీమాంధ్ర ఉద్యోగులు పెట్టిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ తెలంగాణ, సీమాంధ్ర ప్రజల మధ్య విద్వేషాలు పెంచిందని దేవి ప్రసాద్ అన్నారు.