వైఎస్ఆర్ సీపీ కేంద్ర పాలకమండలి సభ్యునిగా.. నార్నె
అమరావతి: ప్రముఖ పారిశ్రామికవేత్త, జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాస రావుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పదవి దక్కింది. ఆయనకు పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యునిగా నియమించారు. ఈ మేరకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. నార్నె శ్రీనివాసరావు సేవలను పార్టీకి వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఆయనకు కేంద్ర కమిటీలో స్థానం కల్పించినట్లు జగన్ తెలిపారు.
నార్నె శ్రీనివాసరావు ఇటీవలే వైఎస్ఆర్ సీపీలో చేరిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఆయనకు అసెంబ్లీ టికెట్ ఇస్తారనే ప్రచారం సాగుతోంది. నియోజకవర్గం ఇంకా ఖరారు కానప్పటికీ.. ప్రకాశం జిల్లా నుంచి ఆయన అసెంబ్లీ బరిలో నిల్చుంటారని అంటున్నారు. దీనిపై నార్నె వాదన భిన్నంగా ఉంటోంది. ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతో తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరలేదని కరాఖండిగా చెబుతున్నారు.

చాలాకాలం నుంచి తనకు వైఎస్ జగన్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అన్నారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని తాను కోరుకుంటున్నానని, దీనికోసం తనవంతు సహాయ, సహకారాలను అందించడానికే తాను పార్టీలో చేరానని నార్నె శ్రీనివాసరావు స్పష్టం చేస్తున్నారు. పోటీ చేయాలనే ఉద్దేశం లేనప్పటికీ.. నార్నె వంటి వ్యక్తి చట్టసభలో ఉండటం పార్టీకి అవసరమని వైఎస్ జగన్ భావిస్తున్నారని, గెలిచే అవకాశాలు ఉన్న స్థానంలో ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తారని సమాచారం.












Click it and Unblock the Notifications