నవరత్నాల కంటే ఎక్కువే ఇస్తోన్నాం.. జగన్ సర్కార్ తీరుపై సోము వీర్రాజు ఫైర్
జగన్ సర్కార్పై బీజేపీ విమర్శలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ తీరును ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు తప్పుపట్టారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఇస్తున్న నిధులను వాడేసుకుంటూ.. రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలుగా గొప్పలు చెప్పుకుంటోందని ధ్వజమెత్తారు. ఉపాధి పథకం ద్వారా ఒక జాబ్ కార్డుకి ఏడాదికి రూ.35 వేల చొప్పున కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తోందని సోమువీర్రాజు తెలిపారు. అలాగే ప్రతి రైతుకు రూ.6 వేల చొప్పున కేంద్ర ప్రభుత్వం అందజేస్తోందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నవరత్నాల కంటే ఎక్కువగా కేంద్ర ప్రభుత్వం పథకాలు అందిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎంవైకే కింద ఇంటి నిర్మాణానికి పట్టణాల్లో రూ.2,80,000.. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,50,000 అందజేస్తోందని సోమువీర్రాజు తెలిపారు. కేంద్రం ప్రభుత్వం ఇస్తున్న పథకాలను బూత్ కమిటీల ద్వారా ప్రతి ఇంటికి చేరవేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
జగన్ ప్రభుత్వం ఇస్తున్న పథకాలన్నీ కేంద్రం డబ్బుతోనే అని చాటిచెప్పే ప్రయత్నం చేస్తోంది. బీజేపీని గెలిపిస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ఆస్కారం ఉంటుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఏపీలో ప్రత్యామ్నాయం ఏర్పడాలంటే బీజేపీతోనే సాధ్యం అంటున్నారు. జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాకే దశాదిశ ఉన్న ప్రభుత్వం వస్తుందని చెబుతున్నారు.
Recommended Video
బియ్యం, ఉపాధి హామీ అన్నీ కేంద్రమే ఇస్తోందని బీజేపీ నాయకులు.. జగన్ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని ఆరోపించారు. పెండింగ్ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారని సీఎం జగన్ని ప్రశ్నిస్తున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు. ఉత్తరాంధ్ర పెండింగ్ ప్రాజెక్టులపై పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతున్నామని బీజేపీ నాయకులు తెలిపారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని, నిరుద్యోగులకు నిరీక్షణ తప్ప ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. సాగునీటి సమస్యల పరిష్కారానికి ఈ నెల 19న 'చలో కడప' చేపట్టబోతున్నారు.