25 కేజీల బియ్యం, కంది పప్పు, నూనె.. వరద ప్రభావిత ప్రజలకు నిత్యావసర సరుకులు: సీఎం జగన్
వర్ష బీభత్సంతో ఏపీ కకావికలమైంది. సీమ ప్రాంతం జలమయంగా మారింది. తమను ఆదుకోవాలని అక్కడి ప్రజలు వేడుకుంటున్నారు. ఇప్పటికే సహాయ చర్యల్లో అధికారులు నిమగ్నం అయ్యారు. మరోవైపు వరద బాధిత కుటుంబాలను ఆదుకుంటామని సీఎం జగన్ స్పష్టంచేశారు. వారికి కావాల్సిన సరుకులను అందజేస్తామని ఆయన వివరించారు. వరద ప్రభావిత జిల్లాలలో నిత్యావసర సరకుల పంపిణీకి ప్రభుత్వ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు.
వరద బాధిత కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, లీటర్ వంటనూనె, కేజీ ఉల్లిగడ్డలు, కేజీ బంగాళాదుంపలను ఉచితంగా సరఫరా చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న రాష్ట్రంలోని చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల్లోని వరద బాధితులకు ఈ ఉచిత సాయం అందనుంది.

వరద ప్రభావిత ప్రాంతాలకు చెందిన ఇంఛార్జ్ మంత్రులు, ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ పర్యవేక్షించాలని జగన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాల్సిన అవసరం లేదని జగన్ సూచించారు. ఈ మేరకు వారు ప్రజలకు తక్షణ సాయం అందించేలా చర్యలు తీసుకోవాలని హితవు పలికారు. వరదల కారణంగా జరిగిన ఆస్తి నష్టం, పంట నష్టంపై అంచనాలను ప్రభుత్వానికి అందించాలని సూచించారు. మరోవైపు వర్షాల వల్ల దెబ్బతిన్న రైతులు తిరిగి పంటలు వేసుకునేలా వాళ్లకు విత్తనాలు అందేలా చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రాయలసీమ జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపాయి. గత వారం రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలతో రాయలసీమ జిల్లాలు చిగురుటాకులా వణికిపోయాయి. గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. తిరుపతిలో ఇదివరకు ఎన్నడూ చూడని విధంగా వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలు, వరదల వల్ల తిరుమల కొండచరియలు విరిగి ఘాట్ రోడ్డుపై పడిపోయాయి. మెట్టుమార్గంలో చెట్లు, వరద నీటితో అస్థవ్యస్థంగా తయారైంది. తిరుమల కొండలపైనుంచి వస్తున్న వాన నీటితో కపిలతీర్ధంలో మండపం కూలిపోయింది. తిరుమల జలదిగ్బందంలో చిక్కుకొనిపోయింది.












Click it and Unblock the Notifications