టీడిపిలో ఆయన నంబర్ టూ..! పార్టీ ప్రయోజనాల కన్నా బందుత్వమే ఆయనకు ఎక్కువ..!!
హైదరాబాద్ : ఏపి తెలుగుదేశం పార్ఠీలో ఆయనది రెండవ స్థానం. టీడిపి జతీయ అద్యక్షుడు చంద్రబాబు నాయుడు తర్వాత ఆయన పేరునే ప్రస్తావిస్తుతంటారు కార్యకర్తలు. పెద్ద దిక్కుగా వ్యవహరిస్తూ పార్టీని విమర్శిస్తున్న వారిపై ప్రతివిమర్శలు చేసి కట్టడి చేయాల్సిన ఆయన మాత్రం బెల్లం కొట్టిన రాయిలా వ్యవహరిస్తుంటారు. ఎప్పుడు చూసినా మౌన ముని పాత్ర పోషిస్తూ సమాజాన్ని తెగ చదివేస్తున్నట్టు కనిపిస్తుంటారు. ఇటీవల తెలంగాణ నుండి ఓ మాజీ మంత్రి ఏపిలో సంక్రాంతి పండగ మజా చేయడానికి వెళ్లినప్పుడు దగ్గరుండి లాంచనాలు పర్యవేక్షించారు ఆ నాయకుడు.
ఏపి రాజకీయాల పట్ల అసందర్బ వ్యాఖ్యలు..! ఖండించని ఏపి టీడిపి రెండవ స్థాయి నేత..!
అన్ని మర్యాదలూ ఆస్వాదించిన తర్వాత అదే గడ్డ మీద ఏపీ రాజకీయాల పట్ల నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నా ఒక్కటంటే ఒక్క కౌంటర్ ఇవ్వకపోవడం ఆయనకే చెల్లిందని పార్టీలో చర్చ జరుగుతోంది. అంతే కాదు సదరు మాజీ మంత్రి వర్యులు రెండు రోజుల పాటు ఏపీ లో మకాం వేసినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం లో అత్యున్నత పదవిలో ఉన్న మరో వ్యక్తి కూడా దగ్గరుండి సపర్యలు అందించినట్టు తెలుస్తోంది. వ్యక్తిగతంగా ఎవరు ఎలాంటి వారికైనా ఆతిథ్యం ఇవ్వొచ్చు.., పుచ్చుకోవచ్చు గాని రాజకీయంగా ఒక గూటి పక్షులను విడదీసి కకావికలం చేసే ప్రయత్నాలను మాత్రం కడుపుకు అన్నం తింటున్నవాడు ఎవరైనా ఖండించాల్సిన అవసరం ఉంది.
రాజకీయం కన్నా బంధుత్వమే మిన్న..! మౌనముద్రలో ఆ నాయకుడు..!!
కాని ఏపిలో సకల మర్యాదలు, సకల భోగాలు, షడ్రుచులు ఆస్వాదించిన తర్వాత, వాటి రుచి తాలూకా సువాసనలు తిన్న చేతి నుండి పూర్తిగా ఆరిపోక ముందే ఏపి పరిస్థితులపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తే ఎంతటి వారికైనా రక్తం మరగక మానదు. కాని దగ్గరుండి అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పటికి పల్లెత్తి మాట మాట్లాడని సదరు నెంబర్ టూ నేతను ఏమనాలో అర్ధం కాని పరిస్ధితులు నెలకొన్నాయి. బందుత్వం ముందు ఏదైనా బలాదూర్ అని ఏపి లోని ఆ రెండవ స్థానం నేత మరో సారి నిరూపించారు.
సంక్రాంతి మజా చేసిన తెలంగాణ మాజీ మంత్రి..! ఆ వెంటనే ఘాటు విమర్శలు..!!
అసలు తెలంగాణ, ఏపిలో జరుగుతున్న పరిణామాల పట్ల ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఘాటుగానే స్పందిస్తున్నారు. ఏపి రాజకీయాల గురించి, అక్కడి ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి ముఖ్యమంత్రి స్థాయిలో ఇరువురూ విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. అది సహజం. అవసరం లేకున్నా, సబ్జెక్టు తనది కాకున్నా ఏపి రాజకీయాల్లో జోక్యం చేసుకుంటామని సదరు మంత్రి అసందర్బ ప్రేలాపనలు చేస్తున్నా పక్కనే ఉన్న ఆ రెండవ స్థాయి నేత నోరు ఎందుకు మెదపలేదనే చర్చ జరుగుతోంది.
రాజకీయాలు వేరు..! బందూత్వం వేరు..! మరి ఆరోపణలు ఎందుకు..?
ఏపి ముఖ్యమంత్రిని గాని, ఏపి రాజకీయాల్లో జోక్యం చేసుకుంటామని గాని మాట్లాడిన సదరు మాజీ మంత్రికి అసలు ఆ స్థాయి ఉందా అన్నది కూడా పరిగణలోకి తీసుకోవాలి. మనో భావాలను రెచ్చగొట్టడం, కవ్వింపుగా మాట్లాడటమే రాజకీయ చతురత అనపుకుంటే పెద్ద పొరపాటు చేసినట్టే..! అదే పొరపాటును దగ్గరుండి మందలించకపోవడం కూడా తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం కన్నా నీచమైన చర్యే..! ఇప్పటికైనా ఇలాంటి చౌకబారు రాజకీయాలను ఏపీ నెంబర్ టూ నాయకుడు ప్రోత్సహించకుండా ఉంటే చాలా శ్రేయస్కరంగా ఉంటుందనే చర్చ జరుగుతోంది.