జనసేన కోసం వందల కోట్లు వదిలేసి..: 2ఏళ్ల షరతుపై 25శాతమూ వదిలేసి.. ఎవరీ శేఖర్ పులి?
అమరావతి: ఎన్నారై పులి శేఖర్ జనసేన పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక బాధ్యతలు అప్పగించారు. జనసేన సెంట్రల్ కమిటీ ఫర్ పార్టీ అఫైర్స్ చైర్మన్గా నియమించారు.
ఈ సందర్భంగా ఆయనపై పవన్ ప్రశంసలు కురిపించారు. ఇటీవల పలువురు కీలక వ్యక్తులు జనసేనలో చేరుతున్నారు. ఇప్పుడు పులి శేఖర్ చేరారు. ఆయనకు పదవి ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈయన ఎవరనే విషయాన్ని జనసేన వెల్లడించింది.

ఎవరీ శేఖర్ పులి?
ఆశాజ్యోతి సంస్థ ద్వారా ఏటా 5వేల మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు అందిస్తున్న సాఫ్టువేర్ సంస్థల నిర్వాహకులు శేఖర్ పులి. అమెరికాలోని డల్లాస్లో క్లౌడ్ మేనేజ్మెంట్కు సంబంధించిన సంస్థకు అధిపతి. మచిలీపట్టణం నుంచి రెండు దశాబ్దాల క్రితం అమెరికాకు వెళ్లారు. అక్కడ తన రంగంలో దూసుకెళ్లారు. శేఖర్ తాత నాయుడు నాగేశ్వర రావు స్వాతంత్ర పోరాటయోధులు. శేఖర్ భీమవరంలో ఇంజినీరింగ్ చదువు పూర్తి చేసుకొని అమెరికాలో ఎంఎస్ చదివారు. ప్రముఖ సాఫ్టువేర్ సంస్థలో పని చేశారు.
ఈ కంపెనీని టేకోవర్ చేసిన ఎంఎన్సీ
అనంతరం ఎంబీఏ పూర్తి చేసి సొంతగా కంపెనీని ప్రారంభించారు శేఖర్. అది వందల కోట్ల విలువైన సంస్థగా ఎదిగింది. ఈ సంస్థను ఇటీవల ప్రముఖ ఎంఎన్సీ టేకోవర్ చేసింది. ఒప్పందంలో భాగంగా శేఖర్ మరో రెండు సంవత్సరాలు ఆ సంస్థతో కలిసి ఉండాలి. లేదంటే టేకోవర్ నిర్ణయించిన మొత్తంలో 25 శాతం వదులుకోవాలి. జనసేన కోసం శేఖర్ ఆ 25 శాతం ఆదాయాన్ని త్యాగం చేశారు.

అదే ఆకర్షించింది
విలువైన మేధో సంపద ఎందుకు భారతదేశం నుంచి విదేశాలకు వెళ్లిపోతుంది, ఇక్కడ ఎలాంటి పాలన విధానాలు అమలైతే విదేశాల నుంచి ఆ మేధో సంపదను తిరిగి మన దేశం పొందగలదు అనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచన పులి శేఖర్ను ఆకర్షించింది. జనసేనకు ఉన్న బలమైన ఏడు సిద్ధాంతాలు పులి శేఖర్ను కదిలించాయి. పార్టీ నిర్వహణలో పాలుపంచుకునేందుకు తన సంస్థలను కూడా పక్కన పెట్టి ఏపీకి వచ్చారు.












Click it and Unblock the Notifications