తీరు మారని అనంతపురం ఆసుపత్రులు: కలెక్టర్ ఏం చెబుతున్నారు?: సున్నా నుంచి వందల్లో
అనంతపురం: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్ దేశాన్ని తీవ్రంగా దెబ్బ కొడుతోంది. అన్ని రాష్ట్రాల తరహాలోనే ఏపీలోనూ ఆక్సిజన్ కొరత నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షలకు పైగా ఉన్న కరోనా వైరస్ పేషెంట్లకు అవసరమైన చికిత్సను అందించడానికి చాలినన్ని ఆసుపత్రులు అందుబాటులో ఉండట్లేదు. ఐసీయూలు, పడకలు, వెంటిలేటర్ల కొరత వెధిస్తోంది. ఏ రాష్ట్రం కూడా దీనికి మినహాయింపు కాదు. ఈ పరిస్థితుల్లో తమ ప్రజలను తాము కాపాడుకోవడానికి అన్ని రాష్ట్రాలు ప్రాధాన్యత ఇస్తోన్నాయి. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాగా పేరున్న అనంతపురంలో ఆసుపత్రుల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైందనే ఆరోపణలు ఉన్నాయి.

కోవిడ్ వార్డులో పడకల కొరత..
అనంతపురం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని కోవిడ్ వార్డులో పడకల కొరత ఏర్పడింది. ఒకే బెడ్పై ఇద్దరు కరోనా పేషెంట్లకు చికిత్స అందించాల్సిన దుస్థితి నెలకొంది. బెడ్స్ దొరక్కపోవడం వల్ల కూర్చున్న వారికి కూర్చున్నట్టే ఆక్సిజన్ను అందించే పరిస్థితి ఏర్పడిందక్కడ. రోజురోజుకూ మార్పులు చెందాయని, ఇప్పుడు మెరుగు పడ్డాయని అక్కడి నర్సులు చెబుతున్నారు. పడకల కొరత వల్ల బయటి నుంచి కుర్చీలను తెప్పించి వారికి ఆక్సిజన్ను అందించిన సందర్భాలు ఉన్నాయని మాధవి అనే స్టాఫ్ నర్స్ ది ప్రింట్ పోర్టల్కు వివరించారు.

ముందుకొచ్చిన స్వచ్ఛంద సంస్థలు
కోవిడ్ వార్డుకు పేషెంట్ల తాకిడి పెరగడం వల్ల ఆసుపత్రి ఆవరణలోని వాహనాల పార్కింగ్ ప్రదేశంలో కూర్చీలను ఏర్పాటు చేసి, ఆక్సిజన్ అందించినట్లు తెలుస్తోంది. కొన్నిరోజుల పాటు ఈ పరిస్థితి కొనసాగినట్లు ది ప్రింట్ పేర్కొంది. ఆలంబన అనే స్వచ్ఛంద సంస్థ ప్రభుత్వ ఆసుపత్రిలో పడక కొరతను తీర్చడానికి ముందుకొచ్చిందని, 30 బెడ్స్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. ఆసుపత్రిలో నెలకొన్న దుస్థితిని గమనించిన ఆలంబన సంస్థ ప్రతినిధి మేకా జనార్ధన్.. స్వచ్ఛందంగా ముందుకొచ్చారని, పడకలను ఏర్పాటు చేశారని పేర్కొంది.

ప్రైవేటు ఆసుపత్రుల మాటేంటీ?
3,347 గ్రామాలకు జిల్లా వ్యాప్తంగా ఆరు ఆసుపత్రులే ఉండటం, యాక్టివ్ కేసులు అధికంగా నమోదవుతోన్నందున.. ఆ ఆసుపత్రుల్లో వసతి సౌకర్యాలు చాలట్లేదని తెలిపింది. ఆక్సిజన్ కొరత వల్ల ప్రైవేటు ఆసుపత్రులు కరోనా వైరస్ పేషెంట్లను అడ్మిట్ చేయించుకోవట్లేదని ఆ పోర్టల్ కథనం ప్రకారం తేలింది. అనంతపురం టౌన్లో 10 ఆసుపత్రుల్లో ఇదే పరిస్థితిని నెలకొన్న విషయాన్ని గుర్తించినట్లు ది ప్రింట్ పేర్కొంది. జిల్లా అధికారుల ఆదేశాల వల్లే తాము కోవిడ్ పేషెంట్లను అడ్మిట్ చేసుకోవట్లేదని ఆసుపత్రుల ప్రతినిధులు స్పష్టం చేయగా.. కలెక్టర్ గంధం చంద్రుడు దీన్ని తోసిపుచ్చినట్లు వివరించింది.

సున్నా నుంచి వందల్లో.. వేలల్లో
జిల్లాల కోవిడ్ పరిస్థితులు చాలావరకు మెరుగు పడ్డాయని గంధం చంద్రుడు పేర్కొన్నారు. ఏడాది కాలంగా వైద్య, ఆరోగ్యానికి సంబంధించిన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తూ వచ్చామని చెప్పారు. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ను దృష్టిలో ఉంచుకుని ఆసుపత్రులకు మౌలిక సదుపాయాలను కల్పించడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామని పేర్కొన్నారు. గత ఏడాది 14 ఐసీయూ బెడ్స్ ఉండగా.. వాటి సంఖ్యను 250కి పెంచామని గంధం చంద్రుడు తెలిపారు. ఇదివరకూ ఒక్క ఆక్సిజన్ బెడ్ కూడా ఉండేది కాదని.. అలాంటిది ఈ ఏడాది కాలంలో 1,200లకు పెంచామని, అలాగే ఆక్సిజన్ స్టోరేజీ సామర్థ్యాన్ని సున్నా నుంచి 56,000 లీటర్లకు పెంచామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications