రక్తపుటేరులు పారిన నేలలో సాగునీటి గలగల- అనంతలో టీడీపీ అడ్రసు గల్లంతన్న సాయిరెడ్డి
అనంతపురం జిల్లాలో టీడీపీ, వైసీపీ మధ్య రాజకీయాలు వేడెక్కాయి. జిల్లాలోని హంద్రీనీవా ప్రాజెక్టు కింద నిర్మించిన అప్పర్ పెన్నా ఎత్తిపోతల పథకానికి టీడీపీ హయాంలో దివంగత నేత పరిటాల రవి పేరు పెట్టగా.. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం దాన్ని తొలగంచి దివంగత సీఎం వైఎస్సార్ పేరు పెట్టింది. దీనిపై జిల్లాలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య తీవ్ర మాటల యుద్దం సాగుతోంది.
అప్పర్ పెన్నా ఎత్తిపోతల పథకానికి పరిటాల రవి పేరు తొలగించి వైఎస్సార్ పేరు పెట్టడంపై టీడీపీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. అయితే దీనిపై స్పందించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. అనంతపురంలో రక్తపుటేరులు పారించిన చరిత్ర టీడీపీది అంటూ ట్వీట్ చేశారు. అటువంటి చోట ఇప్పుడు సాగునీటి గలగలలు వినిపిస్తాయంటే అడ్రసు గల్లంతవుతుందని టీడీపీ నేతలకు భయం పట్టుకుందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. కరువు సీమను పచ్చని నేలగా, పరిశ్రమల నెలవుగా అభివృద్ధి చేయడానికి సీఎం జగన్ సడలని దీక్షతో కృషి చేస్తున్నారని సాయిరెడ్డి ప్రశంసించారు.
గతంలో 1995లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా.. అనంతపురంలో ఫ్యాక్షన్ రాజకీయాలు నడిచేవి. అప్పట్లో వాటిలో క్రియాశీలకంగా ఉన్న టీడీపీ నేత పరిటాల రవీంద్రను 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హత్య చేశారు. దీంతో దాడులు, ప్రతిదాడులు కొనసాగాయి. ఆ తర్వాత అంతా సద్దుమణిగిందనుకుంటున్న తరుణంలో పరిటాల రవి పేరుతో ఉన్న ప్రాజెక్టు పేరును వైసీపీ సర్కారు వైఎస్సార్గా పేరు మార్చడంతో ఇప్పుడు తిరిగి సవాళ్లు, ప్రతిసవాళ్లు చోటు చేసుకుంటున్నాయి.