కడప జిల్లాలో ఘోరం .. జిలెటిన్ స్టిక్స్ పేలి 10మంది మృతి, సీఎం జగన్ దిగ్భ్రాంతి, చంద్రబాబు స్పందన ఇదీ !!
కడప జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కడప జిల్లా కలసపాడు మండలంలో మామిళ్ళపల్లి శివారులోని తిరుమల కొండ సమీపంలో ఉన్న బైరటీస్ గనుల వద్ద జిలెటిన్ స్టిక్స్ పేలడంతో పది మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది

వాహనం నుండి జిలెటిన్ స్టిక్స్ అన్ లోడ్ చేస్తుండగా పేలుడు , 10 మంది మృతి
బద్వేలు నుండి సున్నపురాయి క్వారీకి వాహనంలో జిలెటిన్ స్టిక్స్ ను తీసుకు వస్తుండగా ప్రమాదవశాత్తు ఈ ఘటన చోటుచేసుకుంది.బొలెరో వాహనంలో నుండి జిలెటిన్ స్టిక్స్ ను అన్ లోడ్ చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి వాహనం పూర్తిగా ధ్వంసం కాగా ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. పేలుడు ధాటికి మృతదేహాలు తునాతునకలుగా మారాయి.దీంతో ప్రస్తుతం మృతదేహాలను గుర్తించడం కష్టంగా మారింది.

భారీ పేలుడుతో మృతుల శరీరభాగాలు తునాతునకలుగా.. ఇప్పటివరకు గుర్తించిన మృతులు వీరే
ప్రమాదం జరిగిన ఘటన స్థలాన్ని పోరుమామిళ్ల సిఐ మోహన్ రెడ్డి, కలసపాడు పోరుమామిళ్ల ఎస్ ఐ లు పరిశీలించారు.భారీ పేలుడుతో మృతుల శరీరభాగాలు తునాతునకలుగా చెల్లాచెదురుగా పడ్డాయి. మృతుల్లో కలసపాడు మండలంలోని గంగయ్య పల్లెకు చెందిన ప్రసాద్ ఉన్నట్టు గుర్తించారు.మృతి చెందిన వారిలో పులివెందుల వాసులు సుబ్బారెడ్డి, బాల గంగులు, ప్రసాద్ వెంకటరమణ ఉన్నట్లుగా గుర్తించారు ఇంకా పలువురి వివరాలు తెలియాల్సి ఉంది.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
మిగతావారు కూడా పులివెందులకు చెందిన వారిగా గుర్తించిన పోలీసులు మృతుల వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. భారీ పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఒక్కసారిగా భూకంపం అని భయపడ్డారు. విషయం తెలిసి షాక్ అయ్యారు . ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

పేలుడు ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
కడప జిల్లాలో చోటు చేసుకున్న ముగ్గురాయి క్వారీలో జరిగిన పేలుడు ఘటనపై సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పేలుడు జరగడానికి గల కారణాలను జగన్ ఉన్నత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇదిలా ఉంటే కడప జిల్లాలోని మామిళ్ళపల్లి శివారులో క్వారీలో పేలుడు ఘటనపై మాజీ సీఎం చంద్రబాబునాయుడు స్పందించారు.
Recommended Video
ఎల్జీ పాలిమర్స్ బాధితులకు వలే కడప క్వారీ మృతులకు నష్టపరిహారం ఇవ్వాలన్న చంద్రబాబు
ఈ ఘటనపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సీఎం సొంత జిల్లాలో ఇలాంటి పరిస్థితి నెలకొనడం బాధాకరమని వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలో జరిగిన ఎల్జి బాధితులకు నష్ట పరిహారం అందినట్లు గానే క్వారీలో మృతి చెందిన వారికి కూడా నష్టపరిహారం అందించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.












Click it and Unblock the Notifications