ఏపి రెక్కలు విరగనివ్వం.. రైల్వే జోన్, రాజధానికి నిధులు: సుజనా
హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ సమావేశాలు ముగిసిన అనంతరం (మార్చి 20న) ఆంధ్రప్రదేశ్కు రైల్వే జోన్ ప్రకటిస్తామని, దీనిపై ఎటువంటి అపోహలకు తావులేదని, విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి పేర్కొన్నారు. రాష్ట్ర రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని, వివిధ పద్దుల కింద వచ్చే ఏడాదికి పదివేల కోట్ల రూపాయలను కేంద్రం విడుదల చేస్తుందని తెలిపారు.
ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మార్చి నెలాఖరులోగా ఈ ఏడాదికి సంబంధించి పెండింగ్లో ఉన్న అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి రూ. 3వేల కోట్లు విడుదల చేస్తున్నట్టు చెప్పారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం రెండువేల కోట్లు సిద్ధం చేసిందన్నారు. ఏపి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటామని, హామీలను నెరవేర్చడానికి కృషి చేస్తున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్ రెక్కలు విరవం, విరవనివ్వం అని ఆయన అన్నారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి కూడా నిధులు విడుదల చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఈ ఏడాదికి రూ.350 కోట్లు, వచ్చే ఏడాదికి రూ.650 కోట్లు విడుదల చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఒకవేళ హోదా ఇవ్వడానికి అవరోధాలు ఎదురైతే, హోదాకు సమానంగా బెనిఫిట్లు ఇస్తే తీసుకోవడం మంచిదన్నారు.
మంత్రివర్గం ఆమోదంలేని హామీల పత్రాన్ని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో చదివారన్నారు. మంత్రివర్గం ఆమోదం కూడా ఈ పత్రానికి లేదన్నారు. కానీ కేంద్రంలో ఎన్డీయే సర్కార్ మాత్రం చిత్తశుద్ధితో హామీలను అమలుచేసే దిశగా కసరత్తు ప్రారంభించిందన్నారు. తిరుపతిలో ఈ ఏడాది నుంచే ఐఐటి తరగతులు ప్రారంభం అవుతాయన్నారు.
అనంతపురంలో వచ్చే ఏడాది జాతీయ సెంట్రల్ ఎక్సైజ్ అకాడమి ఏర్పాటు చేస్తామని, ఇప్పటికే ఈ కేంద్రాన్ని తాత్కాలికంగా ఇక్కడ ప్రారంభించామన్నారు. అకాడమి ఏర్పాటుకు కేంద్రం 500 కోట్లు ఇచ్చిందన్నారు. ఏపి అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న టిడిపి- బిజెపిలను కాంగ్రెస్ పార్టీ నేతలు ఇష్టం వచ్చినట్టు విమర్శించడం సరికాదన్నారు.