కారు టైర్ పంక్చర్: బైక్ని ఢీకొట్టి లారీ కిందకు దూసుకెళ్లింది, 11 మంది మృతి
విశాఖ: విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నక్కలపల్లి మండలం కాగిత గ్రామం దగ్గర కారు.. ట్రాలరు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు ట్రాలర్ కిందకు దూసుకు వెళ్లింది. విశాఖ నుంచి విజయవాడ వెళ్తుండగా కారు టైర్ పంక్చర్ కావడంతో ఈ ప్రమాదం సంభవించింది.
లారీ - కారు - బైక్ ఢీకొన్న ఈ ఘటనలో 11 మంది మృతిచెందారు. విశాఖ నుంచి తుని వైపు వెళ్తున్న కారు టైరు పేలిపోవడంతో అదుపుతప్పి అవతలి వైపు వెళ్తున్న బైక్ను మొదట ఢీకొంది. ఆ తర్వాత బైక్ను ఈడ్చకుంటూ వెళ్తూ... ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది.
ఈ ఘటనలో కారులోని తొమ్మిది మంది, బైక్ పైన ఉన్న వారిలో ఒకరు మృతి చెందారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయచర్యలు చేపట్టారు. పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై వాహన రాకపోకలు నిలిచిపోయాయి. భయానక సంఘటన, రోడ్డుపై ఎక్కడికక్కడ పడివున్న మృతదేహాలను చూసి స్థానికులు చలించిపోయారు. కారు, బైక్.. లారీ కిందకు పూర్తిగా వెళ్లిపోవడంతో మృతదేహాలు నుజ్జునుజ్జయ్యాయి. మృతి చెందిన వారిలో బైక్ పైన వెళ్తున్న ఓ వ్యక్తి కూడా ఉన్నాడు. అతను హెటిరో డ్రగ్స్లో పని చేస్తున్నట్లుగా తెలుస్తోంది.