తూర్పు గోదావరి జిల్లాలో బాలికపై అత్యాచారం
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండల పరిధిలోని వడిశలేరు శివారు నారాయణపురంలో 11 ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన ఉప్పలపల్లి లోవకుమార్(19) అత్యాచారం చేశాడు. నారాయణపురంలో బాధితురాలి ఇంటిపక్కన ఉండే లోవకుమార్ అక్కడే ఆడుకుంటున్న బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని రంగంపేట ఎస్ఐ ఆర్ అంకారావు తెలిపారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
నూతన సంవత్సరం ఆరంభమైన కొద్ది నిమిషాల్లోనే కరపలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కాకినాడకు చెందిన ఐదుగురు వ్యక్తులు పెదపూడి మండలం శహపురం చర్చిలో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని ఆటోలో తిరిగి వెళుతుండగా కరప మిత్రా గార్డెన్ సమీపంలో ఒక కారు ఆటోను బలంగా ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో జగన్నాధపురానికి చెందిన గుర్రాల మంగ(58)అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందగా మిగిలినవారికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కరప ఎస్ఐ పి.సత్యనారాయణరెడ్డి కేసు నమోదు చేశారు.
అల్లవరం మండలంలోని గోడిలంకవద్ద ప్రధాన రహదారిపై గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. డిసెంబర్ 31 రాత్రి మిత్రులతో సరదాగా గడిపిన వారిద్దరూ కొద్ది గంటల్లోనే మృతిచెందారు. మృత్యువులోను స్నేహంగా అనంత లోకాలకు వెళ్లారు. కొత్త సంవత్సరం ప్రారంభంలో ఈ రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఈ ప్రమాదంలో బెండమూర్లంక పంచాయతీ రెబ్బనపల్లి మత్స్యకార గ్రామానికి చెందిన మల్లాడి ఆదినారాయణ(19), ఓలేటి ఈశ్వరరావు(25) మోటారుసైకిల్పై వేగంగా వెళుతూ రోడ్డు ప్రక్కన ఉన్న కొబ్బరిచెట్టును బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఇద్దరి తలలకు బలమైనగాయాలు కావడంతో తీవ్ర రక్తస్రావం జరిగి ఆదినారాయణ, ఈశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందారు.మోటారుసైకిల్ ధ్వంసం కాగా ఇద్దరి మృతదేహాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి.
ఓలేటి ఈశ్వరరావుకు పది నెలల క్రితమే వివాహమైంది. అమలాపురం ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం ఇద్దరి మృతదేహాలను రెబ్బనపల్లిలో వారి కుటుంబ సభ్యులకు అందజేశామని పోలీసులు తెలిపారు. సీఐ జి.దేవకుమార్ ఆధ్వర్యంలో ఏఎస్ఐ గాబ్రియేల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.