ఏపీలో కొత్తగా 1321 కరోనా కేసులు, 19 మరణాలు: 15వేల దిగువకు యాక్టివ్ కేసులు, జిల్లాలవారీగా
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదువుతున్నాయి. ఓ రోజు ఎక్కువ.. మరో రోజు తక్కువగా కేసులు ఉంటున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 1000పైనే కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 64,461 నమూనాలను పరీక్షించగా.. 1321 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 1321 కరోనా కేసులు, 19 మంది మృతి
తాజాగా నమోదైన 1321 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,10,566కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 19 మంది మృతి చెందారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో ఐదుగురు, కృష్ణా జిల్లాలో నలుగురు, నెల్లూరు జిల్లాలో ముగ్గురు, ప్రకాశం జిల్లాలో ముగ్గురు, తూర్పుగోదావరి, గుంటూరు, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 13,807 మృతి చెందారు.

ఏపీలో 14,853 యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 1499 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 19,81,906కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం 14,853 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,64,71,272 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 225 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అల్పంగా అనంతపురం జిల్లాలో 12 మంది కరోనా బారినపడ్డారు.

ఏపీలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 12, చిత్తూరులో 225, తూర్పుగోదావరిలో 218, గుంటూరులో 128, కడపలో 67, కృష్ణాలో 153, కర్నూలులో 16, నెల్లూరులో 139, ప్రకాశంలో 118, శ్రీకాకుళంలో 30, విశాఖపట్నంలో 42, విజయనగరంలో 31, పశ్చిమగోదావరిలో 142 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,85,192, చిత్తూరులో 2,37,447 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి. ఒక్క విజయనగరం జిల్లాలోనే లక్షకు దిగువగా(82,356) కరోనా కేసులున్నాయి.

దేశ వ్యాప్తంగా కొత్త కరోనా కేసులివే
ఇది ఇలా ఉండగా దేశంలోనూ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పట్టినప్పటికీ.. కేరళలో అత్యధిక కేసులు నమోదవుతుండటంతో కరోనా కేసులు అమాంతం పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. తాజాగా భారతదేశంలో రోజువారీ కోవిడ్ సంఖ్యలు నాలుగు శాతానికి పైగా పెరిగాయి . దేశంలో శనివారం 46,759 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 509 మరణాలు నమోదయ్యాయని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. తాజాగా 17,61,110 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లుగా గణాంకాలు వెల్లడించాయి. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసులు ముందు రోజుతో పోలిస్తే 4.7 శాతం మేర అధికంగా నమోదయ్యాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 3.25 కోట్ల మందికి కరోనా మహమ్మారి కేసులు నమోదు కాగా, 4,37,370 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దేశంోల ప్రస్తుతం క్రియాశీల కేసులో రేటు 1.10శాతానికి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 3,59,775 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న ఒక్కరోజే కరోనా మహమ్మారి బారి నుంచి 31,374 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా కరోనా బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3. 18 కోట్లకు చేరుకుంది. ఇక రికవరీ రేటు 97.56 శాతంగా ఉంది. కేరళ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో కేరళ 32,801 కొత్త కేసులను కేరళ రాష్ట్ర నమోదు చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 38,14,305 కి చేరింది. దక్షిణాది రాష్ట్రంలో మూడు రోజులుగా 30,000 కేసులకు పైగా నమోదవుతున్నాయి. ఇక అత్యధికంగా దెబ్బతిన్న మహారాష్ట్ర, 24 గంటల్లో 4,654 కొత్త కరోనా కేసులు, 170 మరణాలు సంభవించాయి.












Click it and Unblock the Notifications