ఏపీలో తగ్గని కరోనా ఉధృతి: లక్షా 50వేలు దాటిన యాక్టివ్ కేసులు, తాజాగా, 71 మరణాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. అయితే, గత రెండు రోజులతో పోలిస్తే గత 24 గంటల్లో కాస్త తక్కువ కేసులు, మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 1,15,275 నమూనాలను పరీక్షించగా.. 18,972 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సోమవారం సాయంత్రం వెల్లడించింది.
ఏపీలో కొత్తగా 18,972 కరోనా కేసులు, 71 మరణాలు
తాజాగా నమోదైన 18,972 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,63,994కి చేరింది. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 2628 కొత్త కేసులు నమోదు కాగా, అల్పంగా కృష్ణా జిల్లాలో 969 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనా బారినపడి 71 మంది మృతి చెందారు. తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల్లో అత్యధికంగా 9 మంది చొప్పున కరోనాతో మరణించగా, అనంతపురం, కర్నూలులో ఏడుగురు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఆరుగురు, చిత్తూరు జిల్లాలో ఐదుగురు, గుంటూరులో నలుగురు, నెల్లూరులో ఇద్దరు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్కరు చొప్పున కరోనాతో మరణించారు. తాజా మరణాలతో ఇప్పటి వరకు నమోదైన మరణాలు సంఖ్య 8207కు చేరింది.
ఏపీలో లక్షా50వేలుదాటిన యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 10,227 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 10,03,935కి చేరింది. కోలుకుంటున్నవారి కంటే కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు భారీగా ఉంటుండటంతో యాక్టివ్ కేసుల్లో అత్యధిక పెరుగుదల నమోదవుతువుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,51,852 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,67,18,148 కరోనా నమూనాలను పరీక్షించారు.
ఏపీలో జిల్లాల వారీగా భారీగా కొత్త కరోనా కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 1158, చిత్తూరులో 1714, తూర్పుగోదావరిలో 1914, గుంటూరులో 1194, కడపలో 969, కృష్ణాలో 990, కర్నూలులో 2628, నెల్లూరులో 1337, ప్రకాశంలో 1236, శ్రీకాకుళంలో 1732, విశాఖపట్నంలో 1960, విజయనగరంలో 1052, పశ్చిమగోదావరిలో 1088 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ సర్కారు ఆంక్షలను విధించింది. తాజాగా, పబ్లిక్, ప్రైవేట్ రవాణాపైనా ఆంక్షలు విధించారు. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు, అత్యవసర సేవలు మినహా వేటికీ అనుమతి లేదు. కాగా, మాస్కులు ధరించకుంటే రూ. 100 జరిమానా విధించాలని ఏపీ సర్కారు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అయితే, లాక్డైన్ ప్రకటించాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు.
Recommended Video