బియాస్ విషాదం: మరో ఇద్దరి మృతదేహాలు లభ్యం
హైదరాబాద్: హిమాచల్ప్రదేశ్ రాష్ట్రంలోని బియాస్ నదిలో గల్లంతైన విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కాలేజీకి చెందిన మరో ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. గాలింపు చర్యల్లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం రెండు మృతదేహాలు బయటపడ్డాయి.
మృతదేహాలను కరీంనగర్ జిల్లా రేకుర్తికి చెందిన దాసరి శ్రీనిధి, హైదరాబాద్లోని తార్నాకకు చెందిన కె రిషితారెడ్డివిగా గుర్తించారు. ఘటన జరిగిన 42 రోజుల తర్వాత విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోస్టుమార్టం అనంతరం విద్యార్థుల మృతదేహాలు సోమవారం హైదరాబాద్కు చేరుకోనున్నాయి.
కాగా ఘటన జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకు జరిపిన గాలింపు చర్యల్లో 23 మంది విద్యార్థుల మృతదేహాలు దొరికాయి. కల్లూరి శ్రీహర్ష అనే మరో విద్యార్థి మృతదేహం లభించాల్సి ఉంది. రంగారెడ్డి జిల్లా బాచుపల్లిలోని విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కాలేజీకి చెందిన ఇంజినీరింగ్ చదువుతున్న 48 మంది విద్యార్థులు జూన్ 3న విహారయాత్రకు హిమాచల్ప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లారు.
జూన్ 8న సాయంత్రం బియాస్ నదిలో విద్యార్థులు ఫొటోలు దిగుతుండగా పైనున్న లార్జీ డ్యాం నుంచి ఎలాంటి హెచ్చరికలు లేకుండా నీరు వదిలారు. దీంతో నదిలో ఉన్న 24 మంది విద్యార్థులు ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందిన విషయం తెలిసిందే.