కరోనా కలకలం: 24 మందిలో 20 మందికి నెగిటివ్, ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలే: మంత్రి ఆళ్ల నాని
ఆంధ్రప్రదేశ్లో ఒక్క కరోనా వైరస్ పాజిటివ్ రాలేదని మంత్రి ఆళ్ల నాని స్పష్టంచేశారు. 24 మంది అనుమానితులకు పరీక్షలు చేశామని వెల్లడించారు. కరోనా వైరస్కు భయపడాల్సిన అవసరం లేదని.. తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని తెలిపారు. వైరస్ నేపథ్యంలో అన్ని ఆస్పత్రుల్లో తగిన ఏర్పాట్లు చేశామని మంత్రి నాని వివరించారు.
24 మంది అనుమానితులకు వైద్య పరీక్షలు చేశామని మంత్రి ఆళ్ల నాని స్పష్టంచేశారు. వారిలో 20 మంది పరీక్ష ఫలితాలు శుక్రవారం వచ్చాయని చెప్పారు. వారందరికీ నెగిటివ్ వచ్చిందని చెప్పారు. మరో నలుగురి పరీక్ష ఫలితాలు శనివారం వస్తాయని పేర్కొన్నారు. ఏపీలో వైరస్ ప్రభావం లేదని.. అనుమానితులకు పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. ఇతర చోట్ల వైరస్ ప్రబలడంతో ఆందోళన నెలకొందని వెల్లడించారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో తగిన జాగ్రత్తలు తీసుకున్నామని మంత్రి ఆళ్ల నాని చెప్పారు. ఒక్కో ప్రధాన ఆస్పత్రిలో ఐసోలేషన్ గది ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. వైరస్ ప్రబలుతోన్న నేపథ్యంలో మార్కెట్లో మాస్కులకు డిమాండ్ ఉందని చెప్పారు. అయతే ప్రజల అవసరాన్ని క్యాష్ చేసుకొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. ఎంఆర్పీ కన్నా ఎక్కువ ధరకు మాస్కులను విక్రయిస్తే చర్యలు తప్పవన్నారు. ఇప్పటికే రెండు షాపులపై కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు.