ఏపీలో పొత్తుల లెక్క పక్కా : ఢిల్లీ "అద్భుతం" ఏంటి : వైసీపీకి లాభమా -నష్టమా..!!
ఏపీలో పొత్తులు దాదాపుగా ఖాయమయ్యాయి. వైసీపీ నేతలు అంచనా వేస్తున్నట్లుగా టీడీపీ - జనసేన కలిసి పోటీ చేయటం ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ నంద్యాల జిల్లా పర్యటనలో తన వైఖరి తేల్చి చెప్పేసారు. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు సైతం పొత్తులు తప్పవనే సంకేతాలు క్లియర్ గా ఇచ్చారు. రాజకీయల్లో పొత్తులు సహజమని చెప్పటం ద్వారా తాము పొత్తులు పెట్టుకోబోతున్న విషయాన్ని పరోక్షంగా చెప్పకనే చెప్పారు. ఇక, పవన్ సైతం ప్రభుత్వ ఓటు చీల్చమని మరోసారి చెప్పటం ..అదే సమయంలో టీడీపీ ముందుకొస్తే పొత్తుల గురించి మాట్లాడుతానని స్పష్టం చేసారు. అయితే, అదే సమయంలో బీజేపీ ఏపీ చీఫ్ టీడీపీతో పొత్తు ఉండదని..తమకు జనంతోనే పొత్తు ఉంటుందని..అవసరమైతే జనసేనతో ఉంటుందని వ్యాఖ్యానించారు.
"అద్భుతం" .. బీజేపీ సైతం మద్దతిచ్చేలా
దీని పైన స్పందించిన పవన్ "అద్భుతం" జరగవచ్చని వ్యాఖ్యానించారు. దీని ద్వారా జనసేన - టీడీపీ పొత్తు ఖాయమని చెబుతూనే..బీజేపీ సైతం కలిసే దిశగా పావులు కదులుతున్నాయనే విశ్లేషణలు మొదలయ్యాయి. కానీ, బీజేపీ జాతీయ నాయకత్వం మాత్రం టీడీపీతో కలిసేందుకు సిద్దంగా లేరంటూ ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటి వరకు వైసీపీ నేతలు పదే పదే టీడీపీ -జనసేన కలిసే ఉన్నాయని..కలిసే పోటీ చేస్తాయంటూ ప్రచారం చేసారు. దమ్ముంటే సింగిల్ లో పోటీ చేయాలంటే మైండ్ గేమ్ ప్రారంభించారు. కానీ, టీడీపీ - జనసేన అధినేతలు మాత్రం తామ పొత్తుల ద్వారానే ముందుకు వెళ్లనున్నట్లు క్లారిటీ ఇచ్చేసారు. అయితే, బీజేపీ నిర్ణయమే తేలాల్సి ఉంది.
టీడీపీ - జనసేన సంకేతాలు క్లియర్
అయితే, అయిదేళ్లు పాలన చేసిన ప్రభుత్వం పైన వ్యతిరేకత ఎంతో కొంత ఉండటం ఖాయమని..పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమకు మేలు జరుగుతుందని వైసీపీ నేతలు లెక్కలు కడుతున్నారు. పవన్ కళ్యాణ్ తనను నమ్ముకున్న జనసైనికుల తో చంద్రబాబు పల్లకీ మోయించేందుకు సిద్దమయ్యారంటూ వైసీపీ నేతలు పవన్ అభిమానులే లక్ష్యంగా కొత్త వ్యూహం అమలు చేస్తున్నారు. దీని పైన జనసేన లోనూ అంతర్గతంగా చర్చ మొదలైంది. దీని కారణంగానే పార్టీ సమావేశాల్లో తాము ఎవరి పల్లకీలు మోయమంటూ పవన్ చెప్పుకొచ్చారు. కానీ, రాజకీయాల్లో పంతాలు..పౌరుషాలు కాదని వ్యూహాలు మాత్రమే ఉంటాయని పవన్ తాజాగా తేల్చి చెప్పారు. ఇక, 2024 ఎన్నికల్లో టీడీపీ - జనసేన కలవటం ఖాయమనే సంకేతాలు ఇచ్చారు. అయితే, ఇప్పుడు జనసేన -టీడీపీ రానున్న ఎన్నికల్లో వైసీపీకి ప్రధాన ప్రత్యర్ధిగా మారనుంది. బీజేపీ వీరితో కలిసినా..కలవకున్న ఓట్ల పరంగా పెద్దగా ప్రభావం ఉండదనేది వైసీపీ నేతల అంచనా.
వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుంటే నష్టమేనా
అయితే, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కావటంతో... 2019 ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న పరిణామాలను పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇక, కాంగ్రెస్.. వామపక్షాలు కలిసినా పెద్దగా ఓటింగ్ పైన ప్రభావం చూపించలేవనేది వారి విశ్లేషణ. సీఎం జగన్ పూర్తిగా మహిళా -బీసీ-ఎస్సీ-ఎస్టీ-మైనార్టీ ఓట్ బ్యాంకును నమ్ముకున్నారు. ఆ ఓట్ బ్యాంకు బలంగా ఉందని గుర్తించిన టీడీపీ - జనసేన ఆ వర్గాల నుంచి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా..అదే సమయంలో వైసీపీ వ్యతిరేక వర్గాల ఓటు సైతం తమకు అనుకూలంగా మలచుకోవాలంటూ విడి విడిగా కంటే..ఒక్కటిగా పోటీ చేస్తేనే సాధ్యమని ఓపెన్ గానే చెబుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నుంచే క్షేత్ర స్థాయిలో పరోక్షంగా జనసేన - టీడీపీ నేతల మధ్య పరస్పర సహకారం కొన్ని ప్రాంతాల్లో కనిపించింది.
సీఎం జగన్ వ్యూహాలేంటి... సిద్దమయ్యారా
కానీ, ఇదే సమయంలో టీడీపీ - జనసేన తమ పైన కలిసి పోటీ చేయటం ద్వారా సింగిల్ గా ఎదుర్కొనే శక్తి లేదంటూ వైసీపీ చేస్తున్న ప్రచారం ఆ రెండు పార్టీల్లోని కొందరి పైన ప్రభావం చూపే అవకాశం ఉంది. దీని ద్వారా ఆ ఇద్దరు నేతలు...జగన్ బలంగా ఉన్నారని పరోక్షంగా అంగకరిస్తున్నట్లుగా వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. అయితే, బీజేపీ వ్యవహారం తేలిన తరువాత..ఈ పొత్తుల ప్రభావం.. వైసీపీ పైన ఏ మేర ప్రభావం చూపిస్తోంది...ఇప్పటి వరకు పూర్తిగా పాజిటివ్ ఓటు పైనే ఫోకస్ పెట్టిన సీఎం జగన్..ఇప్పుడు వ్యతిరేక ఓటు ను తమకు అనుకూలంగా మలచుకోవటం కోసం ఏ వ్యూహాలు అమలు చేయబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది