సీఎం జగన్ సిద్దం - ముహూర్తం ఫిక్స్ : ఎమ్మెల్యేలకు కొత్త వరం : ఆ మంత్రులకు ఫైనల్..!!
ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయాలకు సిద్దం అవుతున్నారు. ఇక కార్యాచరణలో దిగాలని డిసైడ్ అయ్యారు. తాజాగా జరిగిన మంత్రి వర్గ విస్తరణలో రానున్న రోజుల్లో ప్రజలతోనే ఉండాలని నిర్దేశించారు. ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు సిద్దం అవుతున్నారంటూ వ్యాఖ్యానించారు. ఇది పొలిటికల్ మైండ్ గేమ్ గా వైసీపీ నేతలు చెబుతున్నారు. కానీ, సీఎం జగన్ ముందుగానే ఎన్నికలకు తమ సైన్యాన్ని మాత్రం సిద్దం చేయనున్నారు. అందులో భాగంగా.. వైసీపీ ఎమ్మెల్యేలతో కీలక భేటీ ఏర్పాటు చేసారు. ఈ సమావేశం ఈ నెల 10న జరిగే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు.

ఎమ్మెల్యేలతో సీఎం కీలక భేటీ
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే దీనిని ఏర్పాటు చేసారు. అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేసామని.. ప్రజల్లోకి వెళ్లాలని సీఎం దిశా నిర్దేశం చేయనున్నారు. అదే సమయంలో నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల పని తీరు పైన సీఎం సర్వే నివేదికలతో సిద్దం అయినట్లుగా తెలుస్తోంది. ఏ విధంగా ముందకెళ్లాలో.. క్షేత్ర స్థాయిలో ఏ రకంగా వ్యవహరించాలో సీఎం జగన్ రూట్ మ్యాప్ ఫిక్స్ చేయనున్నారు. టిక్కెట్లు కేటాయింపుకు సంబంధించి తాను పరిగణలోకి తీసుకొనే అంశాల పైన క్లారిటీ ఇవ్వనున్నారు. ఎటువంటి మోహమాటాలకు తావు లేకుండా తన లక్ష్యం.. తాను ఎమ్మెల్యేల నుంచి ఏం కోరుకుంటున్నదీ జగన్ స్పష్టత ఇస్తారని తెలుస్తోంది.

నియోజకవర్గాలకు నిధులు
ఇదే సమయంలో తాము గెలిచినా.. నియోజకవర్గాల్లో పనులు చేయించటానికి నిధుల సమస్య పైనే ప్రధానంగా పలువురు ఎమ్మెల్యేలు పార్టీ సమన్వయ కర్తల వద్ద ప్రస్తావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో..రాష్ట్రంలో ఆర్దిక పరిస్థితులు ఇబ్బంది కరంగా ఉన్నా..ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి డెవలప్ మెంట్ ఫండ్ కింద రెండు కోట్ల మేర నిధులు ఈ బడ్జెట్ లో ప్రతిపాదించే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. దీని ద్వారా నియోజకవర్గంలో పనులకు ఎమ్మెల్యేలకు వెసులుబాటు కలగుతుందని పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. ఉగాది నుంచి ఏపీలో 26 కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభం కానుంది. ఒకటి రెండు జిల్లాల పేర్లు.. మార్పు - చేర్పుల పైన అభ్యంతరాలు ఉన్నా..వాటిని ఈ నెలాఖరులోగా పరిష్కరించే ఆలోచన చేస్తున్నారు.

మంత్రివర్గ విస్తరణ పైనా క్లారిటీ
ఈ నెల 25వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో..ఈ సమావేశాల్లోనే రాజధానుల వ్యవహారం పైన ప్రభుత్వం స్పష్టత ఇస్తుందని తెలుస్తోంది. ఇక, మంత్రివర్గం ఏర్పడి మూడేళ్లు కావటంతో..కొత్తగా మంత్రివర్గ విస్తరణ పైనా సీఎం జగన్ తేల్చే అవకాశం ఉందని సమాచారం. గతంలోనే ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో 80 -90 శాతం వరకు మార్పులు ఉంటాయని..కొత్త వారికి అవకాశం దక్కుతుందని సీఎం చెప్పారు. రెండున్నారేళ్ల కాలానికే మార్పు చేయాలని భావించినా.. మూడేళ్ల కాలం వరకు వారిని కొనసాగించారు. అయితే, ప్రస్తుతం ఉన్న మంత్రులను అందరినీ తప్పించి..కొత్త వారికి అవకాశం ఇస్తారని చెబుతున్నారు. ఈ విషయం పైన సీఎం ఈ సమావేశంలోనే క్లారిటీ లేదా సంకేతాలు అయినా ఇస్తారని తెలుస్తోంది.

పార్టీ ప్లీనరీ - 2024 రూట్ మ్యాప్
జూలై 7, 8 తేదీల్లో పార్టీ ప్లీనరీ సమావేశాల నిర్వహణ పైనా సీఎం ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే, ప్రభుత్వం పైన ప్రతిపక్షాలు వ్యతిరేక ప్రచారం చేస్తున్నా..పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఆ ప్రచారాన్ని తిప్పికొట్టే బాధ్యతలు తీసుకోవటం లేదనే అభిప్రాయం ఉంది. దీంతో..ఈ సమావేశం ద్వారా సీఎం జగన్ టార్గెట్ 2024 లక్ష్యంగా రూట్ మ్యాప్ ఎమ్మెల్యేలకు ఫిక్స్ చేస్తారని తెలుస్తోంది. అదే సమయంలో తాను సైతం ప్రజల్లోకి వచ్చే అంశం పైన క్లారిటీ ఇవ్వనున్నారు.

ప్రజల్లోకి సీఎం జగన్ - నేతలు
చాలా కాలంగా జిల్లాల పర్యటనలకు వెళ్లాలని భావించినా..సాధ్య పడలేదు. ఇక, ఉగాది నుంచి కొత్త జిల్లాలు ఏర్పాటు కానుండటంతో..సీఎం పర్యటనలు ప్రారంభించేలా కసరత్తు జరుగుతున్నట్లుగా సమాచారం. దీంతో..ఒక విధంగా ఈ సమావేశం ద్వారా సీఎం జగన్ వచ్చే ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేయటం లో తొలి అడుగు వేస్తున్నట్లుగా పార్టీలో చర్చ జరుగుతోంది. దీంతో..సీఎం ఏం చెబుతారు..ఎటువంటి నిర్ణయాలు ప్రకటిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications