ఏపీలో కొత్తగా 222 కరోనా కేసులు: పెరిగిన రికవరీ, 2560కి తగ్గిన యాక్టివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు తాజాగా 200కుపైగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 31,473 నమూనాలను పరీక్షించగా.. 222 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గురువారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 222 కరోనా కేసులు, ఇద్దరు మృతి
కొత్తగా నమోదైన 222 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,70,738కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 14,423కి పెరిగింది.

ఏపీలో 2560కు తగ్గిన యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 275 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 20,53,755కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం 2,560 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,00,97,888 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా గుంటూరు జిల్లాలో 38 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కర్నూలు జిల్లాల్లో ఒక్క కొత్త కేసు నమోదైంది.

ఏపీలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 03, చిత్తూరులో 28, తూర్పుగోదావరిలో 27, గుంటూరులో 38, కడపలో 10, కృష్ణాలో 31, కర్నూలులో 01, నెల్లూరులో 24, ప్రకాశంలో 05, శ్రీకాకుళంలో 06, విశాఖపట్నంలో 35, విజయనగరంలో 02, పశ్చిమగోదావరిలో 22 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,94,454, చిత్తూరులో 2,47,691 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి. ఒక్క విజయనగరం జిల్లాలోనే లక్షకు దిగువగా(83,017) కరోనా కేసులున్నాయి.
Recommended Video

దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు, కేరళలోనే సగం కంటే ఎక్కువ
దేశంలో కరోనావైరస్ కేసుల్లో క్రమంగా తగ్గుదల నమోదవుతోంది. అయితే, గత 24 గంటల వ్యవధిలో స్వల్పంగా కేసులు పెరిగాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో 11,919 కరోనా కేసులు వెలుగుచూశాయి. అంతకుముందు రోజు 10,197 కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. కొత్తగా నమోదైన కేసులతో ఇప్పటి వరకు నమోదైన కొత్త కేసుల సంఖ్య 3,44,78,517కు చేరింది. కాగా, కొత్త కేసుల్లో 6849 కేసులు ఒక్క కేరళ నుంచే కావడం గమనార్హం. గత 24 గంటల వ్యవధిలో 11,242 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 3,38,85,132కి చేరింది. బుధవారం 470 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 4,64,623కు చేరింది. పాజిటివిటీ రేటు 0.37 శాతానికి తగ్గింది. ఇది మార్చి 2020 తర్వాత అత్యంత కనిష్టం కావడం గమనార్హం. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. బుధవారం 73,44,739 మంది టీకాలు తీసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు టీకాలు తీసుకున్నవారి సంఖ్య 114కోట్లు దాటింది.












Click it and Unblock the Notifications