ఏపీలో భారీగా తగ్గిన కొత్త కరోనా కేసులు: పెరిగిన రికవరీ, 7 వేలకు తగ్గిన యాక్టివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. అయితే, ఒక్కోరోజు కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా కొత్త కేసులు భారీగా తగ్గాయి. 400కిదిగువనే కేసులు నమోదు కావడం గమనార్హం. గడిచిన 24 గంటల వ్యవధిలో 23,022 నమూనాలను పరీక్షించగా.. 310 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సోమవారం సాయంత్రం వెల్లడించింది. అయితే, కరోనా టెస్టుల సంఖ్య కూడా భారీగా తగ్గడం గమనార్హం.

ఏపీలో కొత్తగా 310 కరోనా కేసులు,ఇద్దరు మృతి
తాజాగా నమోదైన 310 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,57,2562 చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి ఇద్దరు మృతి చెందారు. చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 14,256కి పెరిగింది.

ఏపీలో 8వేల దిగువకు యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 994 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 20,36,048కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం 7,258 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,87,67,963 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా గుంటూరు జిల్లాలో 54 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అనంతపురంలో 2 కేసుల చొప్పున నమోదయ్యాయి.

ఏపీలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 02, చిత్తూరులో 45, తూర్పుగోదావరిలో 38, గుంటూరులో 54, కడపలో 07, కృష్ణాలో 28, కర్నూలులో 04, నెల్లూరులో 51, ప్రకాశంలో 23, శ్రీకాకుళంలో 06, విశాఖపట్నంలో 42, విజయనగరంలో 04, పశ్చిమగోదావరిలో 06 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,92,534, చిత్తూరులో 2,45,176 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి. ఒక్క విజయనగరం జిల్లాలోనే లక్షకు దిగువగా(82,844) కరోనా కేసులున్నాయి.

దేశంలోనూ భారీగా తగ్గిన కొత్త కరోనా కేసులు
దేశంలో కరోనా వైరస్ కేసులు తగ్గాయి. కొత్త కేసులు మార్చి ప్రారంభం నాటి స్థాయికి తగ్గగా.. క్రియాశీల కేసులు 209 రోజుల కనిష్టానికి పడిపోయాయి. ఇక రికవరీ రేటు 98 శాతానికి పెరిగింది. సోమవారం కేంద్రం విడుదల చేసిన ఈ గణాంకాలు సానుకూలంగా కనిపించాయి. అయితే ప్రస్తుతం పండుగల సీజన్ నడుస్తుండటంతో మహమ్మారి విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం, నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత 24 గంటల వ్యవధిలో 10,35,797 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 18,132 మందికి వైరస్ పాజిటివ్గా తేలింది. మరోపక్క మరణాలు కూడా 200 దిగువన నమోదయ్యాయి. నిన్న 193 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 4,50,782కి చేరింది. ఆదివారం 21,563 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కేసులు 3.39 కోట్లకు చేరగా.. రికవరీలు 3.32 కోట్లు(98 శాతం)గా ఉన్నాయి. కొత్త కేసుల కన్నా రికవరీలు ఎక్కువగా ఉంటుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం దేశంలో 2,27,347 యాక్టివ్ కేసులున్నాయి. యాక్టివ్ కేసుల రేటు 0.67 శాతానికి చేరింది. ఇక నిన్న 46,57,679 మంది టీకా వేయించుకున్నారు. మొత్తంగా పంపిణీ అయిన డోసుల సంఖ్య 95 కోట్ల మార్కును దాటింది.












Click it and Unblock the Notifications