చెన్నై ఎయిర్పోర్టు: ఫోన్ మాట్లాడుతూ బ్రిడ్జి పైనుంచి పడి తెలుగు టెక్కీ మృతి
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు మృతిచెందాడు. సోమవారం తెల్లవారుజామున ఎయిర్పోర్టులోని డొమెస్టిక్ టెర్మినల్ 4వ నంబరు గేట్ వద్ద ఉన్న వంతెనపై నుంచి సదరు వ్యక్తి పడిపోయాడు.
ఈ ఘటనలో ఆ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఎయిర్పోర్టు సిబ్బంది సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు.
తొలుత ఇది ఆత్మహత్యా లేదా ఎవరైనా హత్య చేశారా? అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. అయితే సీసీటీవీ ఫుటేజ్లో అతడు జారిపడిపోయినట్లు తేలింది. సదరు వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ వంతెన గోడ మీద కూర్చోడానికి ప్రయత్నించగా.. పట్టు తప్పి పడిపోయినట్లు పోలీసులు తెలిపారు. అతని ఐఫోన్ కూడా ముక్కలైపోయింది.
ఈ ఘటన సోమవారం ఉదయం 6గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. మృతుడు విజయవాడకు చెందిన చైతన్య వుయ్యూరుగా గుర్తించారు. అతడు నగరంలోని బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తున్నట్లు తెలిసింది.
ఘటనకు సంబంధించిన సమాచారం అందడంతో విజయవాడ నుంచి చైతన్య కుటుంబసభ్యులు హుటాహుటిన చైన్నైకి వెళ్లారు. చైతన్య చెన్నైకి ఎందుకు వచ్చాడో తమకు తెలియదని వారు తెలిపారు.