ఏపీలో ఒక్కసారిగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు: 572కు చేరిక: భారీగా డిశ్చార్జ్: ఒక్క కడపలోనే..!
అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్యలో ఒక్కసారిగా పెరుగుదల చోటు చేసుకుంది. 24 గంటల వ్యవధిలో 38 కేసులు నమోదు అయ్యాయి. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 13 కేసులు వెలుగు చూసినట్లు వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీనితో రాష్ట్రంలో మొత్తంగా పెరిగిన పాజిటివ్ కేసుల సంఖ్య 572కు చేరింది. ఇందులో 523 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పటిాకా 35 మంది పూర్తిగా కోలుకుని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. 14 మంది మరణించారు.
కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికం కర్నూలు జిల్లాలోనివే. 24 గంటల వ్యవధిలో ఈ జిల్లాలో 13 కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 126కు చేరింది. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో అయిదు చొప్పున గుంటూరు, కృష్ణా జిల్లాల్లో నాలుగు చొప్పున కొత్త కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. నెల్లూరులో ఆరు, కడపలో ఒక కేసు నమోదైనట్లు వారు ఓ ప్రకటనలో వెల్లడించారు. కొద్దిరోజుల విరామం తరువాత రాష్ట్రంలో ఒక్కసారిగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం ఇదే తొలిసారి అని చెప్పారు.
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. వివిధ జిల్లాల్లో 35 మంది కరోనా వైరస్ పేషెంట్లు పూర్తిగా కోలుకున్నారు. ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇందులో అత్యధికంగా కడపలో 13 మంది ఒకేరోజు డిశ్చార్జి అయినట్లు అధికారులు వెల్లడించారు. విశాఖపట్నం-10, కృష్ణా-4, తూర్పు గోదావరి-3, అనంతపురం-2, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి ఒక్కొక్కరు చొప్పున వైరస్ బారి నుంచి బయట పడ్డారు. కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 14కు చేరింది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో నలుగురు చొప్పున, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఇద్దరు చొప్పున చనిపోయారు.
Recommended Video