ఆన్‌లైన్ మోసగాళ్లు: కౌన్‌బనేగా కరోడ్ పతి పేరుతో లక్షలకు టోకరా

విశాఖపట్నం: అమాయక ప్రజలకు ఆశ చూపి ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతూ రూ. లక్షలు కాజేసిన నలుగురు కేటుగాళ్లను సైబర్‌ క్రైం పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం నగర పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్రైం డీసీపీ టి రవికుమార్‌ మూర్తి ఈమేరకు వివరాలను వెల్లడించారు.

లాటరీ పేరుతో మోసం: విశాఖ నగరంలో నేవీలో పనిచేస్తోన్న బీవీఎస్‌ సంతోష్‌కుమార్‌ సెల్‌ఫోన్‌కు 2013 జనవరి 23న ఓ సంక్షిప్త సందేశం వచ్చింది. అందులో లాటరీలో రూ. 40 లక్షలు గెలుపొందారని నమ్మించి గుర్తింపు కార్డులతో పాటుగా ఆదాయపు పన్ను శాఖకు, నగదు బదిలీ ఖర్చుల పేరిట పలు దఫాలుగా 15 బ్యాంకు ఖాతాల ద్వారా రూ.12,48,700 నగదు కాజేశారు.

దీనిపై సంతోష్‌కుమార్‌ స్థానిక పోలీసులను ఆశ్రయించగా గతంలో ఓ నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నామని, ముంబైకి చెందిన మరో నిందితుడు కమలేష్‌ పూల్‌చంద్‌(36)ను ఇటీవల అరెస్టుచేశామన్నారు.

 4 cyber crime offenders held

'కౌన్‌ బనేగా కరోడ్‌పతి' పేరిట మరో మోసం: విశాఖకు చెందిన శెంకు ఇంద్రజ సెల్‌ఫోన్‌కు 2014 మే 31న కేబీసీ పేరిట ఓ సందేశం వచ్చింది. కేబీసీ వార్షిక లక్కీ డ్రాలో ఆమె ఫోన్‌ నెంబర్‌ ఎంపికైందని, రూ. 25 లక్షలు గెలుచుకున్నారని నమ్మించారు. వెంటనే స్పందించిన ఇంద్రజకు ఆ సొమ్ము రావాలంటే రుసుముల కింద కొంత సొమ్ము చెల్లించాలని నమ్మబలికారు.

దీంతో వారి మాటల మాయలో పడిన ఇంద్రజ పలు దఫాలుగా వేర్వేరు ఖాతాలకు రూ. 3 లక్షల వరకూ నగదు జమచేశారు. చివరికి మోసపోయానని తెలుసుకొని ఆమె స్థానిక పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి పోలీసులు గతంలో ఓ నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ్‌బంగకు చెందిన మరో నిందితుడు మహ్మద్‌ సుల్తాన్‌అన్సారీ(22)ని రెండురోజుల క్రితం అదుపులోకి తీసుకున్నామని డీసీపీ తెలిపారు.

ఆదాయపన్ను రిటర్న్స్‌ దాఖలుచేయాలని ఇంకో మోసం: విశాఖ నగరంలోని పోతినమల్లయ్యపాలెం చినగదిలిలో నివాసం ఉంటున్న వి మణివేలు ఓ సంస్థలో పనిచేస్తున్నాడు. మార్చి 3న తన సెల్‌ఫోన్‌కి కాల్‌చేసి ఐటీ విభాగం నుంచి మాట్లాడుతున్నామని, మీ ఖాతాకు రూ. 19,889 ఆదాయపన్ను రిటర్న్స్‌ వచ్చాయన్నారు. దీంతో నమ్మిన బాధితుడు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ బ్యాంకు ఖాతా వివరాలు, కార్డు నెంబర్‌, ఓటీపీ, సీవీవీ సంఖ్యలు కూడా వారికి చెప్పేశాడు.

కొంత సమయానికి మణివేలు ఖాతా నుంచి రూ.5,04,017 సొమ్ము మాయమైపోయింది. దీంతో మణివేలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేసి మహారాష్ట్రకు చెందిన నిఖిల్‌ రాజేంద్ర నవీడియా(23)ను అదుపులోకి తీసుకున్నారు.

టెలికమ్‌ సంస్థలో ఉద్యోగాల పేరిట: గాజువాక పెదగంట్యాడ భానోజీనగర్‌కు చెందిన పేడాడ విద్యాసాగర్‌ అనే యువకుడు ఉద్యోగం కోసం పలు వెబ్‌సైట్‌ల్లో తన సెల్‌ నెంబర్‌ను జతపరిచాడు. అది గమనించిన ఓ వ్యక్తి 2015 నవంబర్‌ 7న విద్యాసాగర్‌ సెల్‌ఫోనుకి కాల్‌ చేసి డివైన్‌ బిజినెస్‌ సొల్యూషన్స్‌ పేరిట సంస్థ ఏర్పాటు చేశామని, పలు టెలికమ్‌ సంస్థల్లో ఉద్యోగాలు ఇస్తానని నమ్మించి దఫదఫాలుగా నగదును దోచుకున్నాడని తెలిపారు.

రూ. 16 వేల వరకు పంపించిన బాధితుడు ఆలస్యంగా విషయం తెలుసుకొని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఉత్తరప్రదేశ్‌కు చెందిన అజేయ్‌సింగ్‌(23) పోలీసులు విచారణ చేపట్టారని తెలుసుకొని భయంతో బాధితునికి తిరిగి నగదును ఇచ్చేశాడని తెలిపారు. మోసానికి పాల్పడినందుకు కేసు నమోదు చేసి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ తరహా ఆన్‌లైన్ మోసగాళ్ల వలలో పడవద్దని ప్రజలకు ఆయన సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+