సెల్ఫోనే చంపేసింది:లారీ బోల్తా...నలుగురు మృతి,20మందికి గాయాలు
ప్రకాశం జిల్లా: దైవ దర్శనం కోసం లారీలో వెళుతున్న ఓ భక్తుల బృందం డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఘోర ప్రమాదంలో చిక్కుకొంది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు చనిపోగా 20 మందికి పైగా గాయపడ్డారు. మరో ఇద్దరు ఇరువురు మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ విషాదకర సంఘటన ప్రకాశం జిల్లా కొమరోలు మండలం నల్లగుంట్ల సమీపంలో చోటు చేసుకుంది. అయితే సెల్ ఫోన్ ఛార్జింగ్ కోసమని డ్రైవర్ స్టీరింగ్ మీద చేతులు తీసేయడమే ప్రమాదానికి కారణమైనట్లు తెలిసింది.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం...కర్నాటక రాష్ట్రంలోని చిక్బల్లాపూర్ జిల్లా పాపిలి, దేవగానిపల్లె గ్రామాలకు చెందిన 45 మంది పుణ్యక్షేత్రాల దర్శనం కోసమని లారీలో యాత్రగా బైలుదేరారు. ముందుగా కడప జిల్లాలో బ్రహ్మగారిమఠం, కదిరి ఆంజనేయస్వామి దేవస్థానం, పొలపల దైవ క్షేత్రాన్ని సందర్శించి ఆ తరువాత శ్రీశైలం ఆలయ దర్శనం కోసం వెళుతున్నారు.
ఈ క్రమంలో లారీ కొమరోలు మండలం నల్లగుంట సమీపంలోకి రాగానే డ్రైవర్ తన సెల్ఫోన్ ఛార్జింగ్ పెట్టుకునేందుకని స్టీరింగ్ మీద నుంచి చేతులు తీసి మోచేతితో స్టీరింగ్ కంట్రోల్ చేస్తూ ఫోన్ కు ఛార్జింగ్ పిన్ పెట్టేందుకు ప్రయత్నించాడని తెలిసింది. అయితే అదే సమయంలో అక్కడ డ్రైవర్ ఊహించని విధంగా రోడ్డు మలుపు తిరిగి ఉండటం, ఢ్రైవర్ చేతులు స్టీరింగ్ మీద లేకపోవడంతో లారీని అదుపు చేయలేక రోడ్డు ప్రక్కనే ఉన్న మైలు రాయిని ఢీ కొట్టి బోల్తా పడింది.
ఈ సంఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇరవై మందికి పైగా తీవ్ర గాయాలు కాగా వారిలో ఇరువురు మృత్యువుతో పోరాడుతున్నారు. మార్కాపురం డిఎస్పీ రామాంజనేయులు ఆధ్వర్యంలో సహాయచర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications