ఎన్టీఆర్కు మనమిచ్చే నివాళి అదే, 400 ఏళ్లయినా..: చంద్రబాబు బ్రాండ్ అంటూ బాలకృష్ణ
హైదరాబాద్/అమరావతి: తెలుగుదేశం 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరికీ ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. ఆటుపోట్లకు బెదరకుండా, విఘ్నాలకు చెదరకుండా, తెలుగుజాతి అభ్యున్నతే లక్ష్యంగా సాగుతోన్న తెలుగుదేశం ప్రస్థానం స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు.
టీడీపీకి ముందు తర్వాత అనేలా అభివృద్ధి, సంక్షేమం: బాలకృష్ణ
ఏ మహూర్తాన ఆ మహానుభావుడు పార్టీని ప్రకటించారో కానీ.. మహూర్తబలం అంత గొప్పది. అందుకే 4 దశాబ్దాలుగా తెలుగునాట పసుపుజెండా సమున్నతంగా రెపరెపలాడుతుందన్నారు బాలయ్య. రాష్ట్రాభివృద్ధిలో, పేదల సంక్షేమంలో 'టీడీపీకి ముందు, టీడీపీ తర్వాత'' అని చూసేలా చేసిందని.., చరిత్రను తిరగరాసిందని బాలయ్య వెల్లడించారు. ఎన్టీఆర్, చంద్రబాబుల పాలనలో సాధించిన ఎన్నెన్నో అద్భుత విజయాలు, అనితర సాధ్యాలు.. టీడీపీ వినూత్న పథకాలు దేశానికే దిశానిర్దేశం చేశాయని పేర్కొన్నారు. ఆడబిడ్డలకు ఎన్టీఆర్ కల్పించిన ఆస్తిహక్కు దేశానికే దిక్సూచి అయ్యిందన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బాలకృష్ణ.
టీడీపీ విజయాలు అనన్య సామన్యమంటూ బాలయ్య
40 ఏళ్లుగా పార్టీ ప్రస్థానం అప్రహతిహతంగా కొనసాగుతోందంటే వేలాదిమంది నాయకులు, లక్షలాది కార్యకర్తలు, కోట్లాది ప్రజల ఆశీస్సులే కారణం. 21ఏళ్లు అధికారంలో ఉండటం, 19ఏళ్లు ప్రతిపక్షంగా ప్రజల కోసం పోరాడటం నిజంగా అద్భుతం. ఆటుపోట్లకు బెదరకుండా, విఘ్నాలకు చెదరకుండా, తెలుగుజాతి అభ్యున్నతే లక్ష్యంగా సాగుతోన్న టీడీపీ ప్రస్థానం స్ఫూర్తిదాయకం. పుష్కరకాలం ఎన్టీఆర్ నాయకత్వంలో, గత 28ఏళ్లుగా చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం సాధించిన విజయాలు అనన్యసామాన్యం అని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.
400 ఏళ్లయినా తెలుగు ప్రజల గుండెల్లోనే.. కొత్త శకమంటూ బాలకృష్ణ
రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో తెలుగుదేశం పార్టీ కొత్త శకం లిఖించింది. తెలుగుగంగ, హంద్రి-నీవా, గాలేరు-నగరి, శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ఆధునీకరణ, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా తదితర ఎత్తిపోతల పథకాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అన్నపూర్ణ అయ్యాయంటే అదంతా తెలుగుదేశం ఘనతే. నిరంతరం ప్రజల్లో ఉండాలి, ప్రజా సంక్షేమమే పరమావధిగా పని చేయాలన్నారు. 40ఏళ్లే కాదు 400ఏళ్లయినా తెలుగుదేశంపార్టీ తెలుగువారి గుండెల్లో సజీవంగా ఉంటుంది.
ఎన్టీఆర్కు మనమిచ్చే నివాళి అదే: బాలకృష్ణ
దుష్టశక్తులెన్ని ఆటంకాలు కల్పించినా రెట్టించిన ఉత్సాహంతో టీడీపీ ముందుకు దూసుకుపోతుందన్నారు బాలకృష్ణ. పోరాటమే మన ఊపిరి.. ఎన్టీఆర్కు మనం అందించే నివాళి అదే అని అన్నారు. పేదల సంక్షేమానికి శ్రీకారం చుట్టింది టీడీపీనే. ఎత్తిపోతల పథకాలతో అన్నపూర్ణ అయిందంటే టీడీపీ ఘనతే. పారిశ్రామికీకరణకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్. దేశ, విదేశాల నుంచి పెట్టుబడులను రాబట్టారు. తెలుగు రాష్ట్రాల ప్రజల మానసపుత్రిక తెలుగుదేశం. రాష్ట్రాభివృద్ధి, పేదల సంక్షేమమే టీడీపీ రథచక్రాలు. టీడీపీ ప్రగతిరథానికి కార్యకర్తలే చోదకశక్తులు.