ఎపిలో 46,290 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ...భర్తీకి కసరత్తు:ఆర్థికశాఖ మంత్రి యనమల
వీటిలో ఉపాధ్యాయ, లెక్చరర్ పోస్టులు కూడా ఉన్నాయని, ప్రత్యక్ష విధానంలో ఈ ఖాళీలను భర్తీచేయాల్సి ఉందని ఆయన వెల్లడించారు. ఇప్పటికే వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 2,350 పోస్టుల భర్తీకి ఆయా ఏజెన్సీలకు అనుమతి ఇచ్చామని తెలిపారు. ఇదిలావుండగా, రాష్ట్రంలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని భాషా పండితుల(ఎల్పీ) హోదాను పెంచుతామని మంత్రి గంటా శ్రీనివాసరావు ఒక ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు.
ఎమ్మెల్యే చాంద్భాషా లేవనెత్తిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయమై వివరణ ఇచ్చారు. 12,827 భాషా పండిత, వ్యాయమవిద్య ఉపాధ్యాయుల స్థాయిని పెంచుతామని మంత్రి గంటా చెప్పారు. ఇప్పటికే జీవో నం.80 ద్వారా పాఠశాలల్లోని 1500 భాషా పండిత పోస్టులను, 500 వ్యాయామవిద్య ఉపాధ్యాయ పోస్టులను పాఠశాల సహాయకులు(స్కూల్ అసిస్టెంట్)గా స్థాయిని పెంచామని మంత్రి గంటా వివరించారు.
ఇదిలావుంటే అధికార పార్టీ టిడిపి గత ఎన్నికల సందర్భంగా మ్యానిఫెస్టోలో ప్రకటించిన నిరుద్యోగ భృతి పథకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ హామి అమలుకు ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు ఈ పథకానికి 'యువ నేస్తం' అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో నిరుద్యోగ పథకాన్ని గాంధీ జయంతి రోజైన అక్టోబరు 2 నుంచి నిరుద్యోగులకు అందించాలని టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. నిరుద్యోగ భృతి కార్యక్రమం అక్టోబర్ 2 నుంచి ప్రారంభించే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా ప్రకటించారు. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు ప్రారంభమైందని...ఈ ప్రక్రియను ఐటీ శాఖ మంత్రి లోకేష్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని సిఎం చంద్రబాబు తెలిపారు.