చికెన్ వండలేదన్న కోపంతో స్నేహితుడి హత్య: కర్నూలు జిల్లాలో దారుణం!
కర్నూలు జిల్లా అహోబిలంలో దారుణ ఘటన జరిగింది. చికెన్ కూర వండకపోవడంతో ఆగ్రహించిన ఓ వ్యక్తి తన సన్నిహితుడిని రోకలిబండతో కొట్టి హత్య చేసిన ఘటన స్థానికులను షాక్ కు గురి చేసింది. ఈ దారుణ సంఘటన బండి ఆత్మకూరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన ఇద్దరు స్నేహితుల మధ్య జరిగింది.
చికెన్ కోసం స్నేహితుల మధ్య గొడవ
ఎరుకల శంకర్ మరియు వడ్డే శివ ఇద్దరూ మంచి స్నేహితులు . వీరిద్దరూ అహోబిలం సమీపంలోని ఇందిరమ్మ కాలనీలో ఒకే గదిలో నివాసం ఉంటున్నారు. ఇద్దరికీ మద్యం అలవాటు ఉండటంతో రోజూ మద్యం తాగటం, గొడవలు పడటం వారికి అలవాటు. మే 14వ తేదీ రాత్రి కూడా ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. ఆ సమయంలో శివ చికెన్ కూర వండాలని శంకర్ను అడిగాడు. అయితే శంకర్ చికెన్ వండకుండా టమోటా పచ్చడి మాత్రమే తయారు చేశాడు. దీంతో శివ కోపంతో ఊగిపోయాడు.

రోకలిబండతో తలపై మోది హత్య
చికెన్ వండలేదని తీవ్ర ఆగ్రహంతో ఉన్న శివ, రాత్రి 9గంటల ప్రాంతంలో శంకర్ నిద్రలో ఉన్న సమయంలో రోకలిబండతో అతని తలపై, నుదుటిపై బలంగా మోదాడు. తీవ్ర గాయాల పాలైన శంకర్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఘటన తర్వాత శివ అక్కడ నుండి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించి తర్వాత కార్యక్రమాలు కొనసాగించారు.
నిందితుడి అరెస్ట్ , రిమాండ్
నిందితుడు శివను పట్టుకోవటం కోసం గాలింపు చేపట్టారు. మే 20వ తేదీన ఆళ్లగడ్డ - అహోబిలం రహదారిపై పడకండ్ల గ్రామంలోని దుర్గామాత ఆలయం వద్ద శివను పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో నిందితుడిని విచారించి రిమాండ్కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
మద్యం మత్తులో జరిగిన దారుణం
కేవలం చికెన్ వండలేదన్న ఒక చిన్న విషయంపై కక్ష పెంచుకుని హత్య చేయడం అందరినీ నివ్వెరపోయేలా చేసింది. చికెన్ కోసం జరిగిన గొడవ మద్యం సేవించిన సమయంలోనే జరగటంతో ఈ హత్యకు మద్యం సేవించటం ప్రధాన కారణంగా భావిస్తున్నారు పోలీసులు. మద్యం సేవించి, కంప్లీట్ గా మైండ్ కంట్రోల్ లో లేని సమయంలో జరిగిన ఈ హత్య మందుబాబులకు పెద్ద హెచ్చరిక.













Click it and Unblock the Notifications