రోడ్డుపై రూ. 5 లక్షల విలువైన బంగారం.. పారిశుద్ధ్య కార్మికులు ఏం చేశారో తెలుసా..?
పారిశుద్ధ్య కార్మికులు మానవత్వం చాటుకున్నారు. రోడ్డుపై దొరికిన రూ. 5 లక్షల విలువైన బంగారాన్ని బాధితులకు అప్పగించి నిజాయితీని చాటుకున్నారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో విధులు నిర్వర్తించే పారిశుద్ధ్య కార్మికులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. విశాఖలోని మధురవాడ పరిధిలోని పీఎం పాలెంలో ఈ ఘటన జరిగింది.
విశాఖలోని మధురవాడ పరిధిలోని పీఎం పాలెంలో పారిశుద్ధ్య కార్మికులు అరుణ, రాము, స్వచ్ఛ వాహనం డ్రైవర్ ప్రసాద్ ఇటీవల విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో వారికి రోడ్డుపై రూ. 5 లక్షల విలువైన సుమారు 4.5 తులాల రెండు బంగారు నెక్లెస్ లు వారికి కనిపించాయి. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన ఆ కార్మికులు వాటిని తీసుకుని ఎవరివి కావొచ్చు అని ఆరా తీశారు. ఈ క్రమంలో గ్రామంలో ఆరా తీశారు. అయితే ఆ బంగారం రాజగోపాల్ రెసిడెన్సీలో ఉంటున్న రామచంద్రరావు, సౌమ్యకు చెందినవిగా తెలుసుకున్నారు. ఈ క్రమంలో పారిశుద్ధ్య అధికారుల సమక్షంలో బంగారు ఆభరణాలను బాధితులకు అప్పగించారు. మానవత్వం చాటుకున్న కార్మికులు, ఉద్యోగులను బాధితులతో పాటు గ్రామస్థులు ప్రశంసించారు.

ఇక ఇటీవల తమిళనాడు చెన్నెలోని టీ నగర్ కు చెందిన ఓ శానిటేషన్ వర్కర్ కూడా రోడ్డుపై తనకు దొరికిన రూ. 45 లక్షల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులకు అప్పగించి మానవత్వాన్ని చాటుకున్నారు. పారిశుద్ధ్య కార్మికురాలు పద్మ రోజూలాగే ముప్పత్ మాన్ టెంపుల్ స్ట్రీట్ కాలనీలోని రోడ్లను శుభ్రం చేస్తుండగా.. ఆమెకు ఓ బ్యాగ్ కనిపించింది. బ్యాగ్ ఓపెన్ చేయగా అందులో రూ. 45 లక్షల విలువైన బంగారు ఆభరణాలు కనిపించాయి. దీంతో ఒక్కసారిగా షాక్ తిన్న పద్మ.. ఆ బ్యాగును తీసుకుని నేరుగా పాండీ బజార్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి అధికారులకు అప్పజెప్పింది. దాంతో ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు స్థానికులు. పద్మ చేసిన పనికి తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా సంబరపడ్డారు. పద్మకు గౌరవ సత్కారంతో పాటుగా రూ. లక్ష నగదు ప్రోత్సాహం అందించారు.












Click it and Unblock the Notifications