ఐదుగురు ఎమ్మెల్యేలు జంప్: అప్రమత్తమైన జగన్, ఫోన్ చేసి ఆరా?
కర్నూలు: కర్నూలు జిల్లాకు చెందిన అయిదుగురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి జంప్ కానున్నారనే ఊహాగానాల నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ దీని పైన ఆరా తీసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
కర్నూలు జిల్లాలో వైసిపికి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో ఐదుగురు టిడిపిలోకి వెళ్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వారి చేరికకు టిడిపి కూడా అంగీకరించిందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జగన్ అప్రమత్తమైనట్లుగా తెలుస్తోంది.
పార్టీ మారే ఎమ్మెల్యేలు ఎవరో తెలుసుకొని వారికి ఫోన్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. పార్టీలో వారికి ఇచ్చిన ప్రాధాన్యతను గుర్తు చేస్తూ.. పార్టీ మారవద్దని సూచించినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరికొందరు ఎమ్మెల్యేలకు చేసిన సాయాన్ని గుర్తు చేస్తూ వెళ్లవద్దని సూచించారట.
అయిదుగురు ఎమ్మెల్యేలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారనే వార్తల నేపథ్యంలో జిల్లా వైసిపి శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. వారిలో ఉన్న గందరగోళాన్ని తగ్గించేందుకు పార్టీ నాయకత్వం స్పష్టత ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు.
కాగా, గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 14 అసెంబ్లీ స్ధానాలకు గాను కేవలం 3 సీట్లకే టీడీపీ పరిమితమైంది. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకునేందుకు చంద్రబాబు అంగీకరించారని వార్తలు వచ్చాయి.
వీరి చేరికతో కర్నూలు జిల్లాలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావచ్చనేది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేల చేరికపై ఆయా నియోజకవర్గాలకు చెందిన పార్టీ ఇంఛార్జులకు సంకేతాలు కూడా పంపించారని తెలుస్తోంది.
బుధవారం చంద్రబాబు కర్నూలు జిల్లాలో ‘జన్మభూమి - మా ఊరు' కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సైతం ఇందుకు అద్దం పడుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో జిల్లాలోని 14 అసెంబ్లీ స్ధానాలను టీడీపీ పట్టం కట్టాలని అక్కడి ప్రజలను సూచించారు.