భారీ వర్షాలు: కేసీఆర్కు వెంకయ్య ఫోన్ చేసి ఆరా, చైనా నుండి బాబు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ముఖ్యంగా తెలంగాణలోని వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో ఎక్కువ నష్టం వాటిల్లింది. వేలాది హెక్టార్లలో పంట నష్టం జరిగింది. దీంతో రైతు కన్నీరుమున్నీరు అవుతున్నాడు. అకాల వర్షం నష్టం పైన తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చైనా నుండి సమీక్షించారు.
తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాల వల్ల జరిగిన నష్టం పైన కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్కు వెంకయ్య ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంట నష్టాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కుందారియా, రాజ్ నాథ్ సింగ్కు వెంకయ్య వివరించారు. తెలంగాణలో పంట నష్టపోయిన ప్రాంతాల్లో బుధవారం నాడు వెంకయ్య, కుందారియా, దత్తాత్రేయలు పర్యటించనున్నారు.
పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకునేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు రాష్ట్ర అధికారులను ఆదేశించారు. చైనా పర్యటనలో ఉన్న చంద్రబాబు విపత్తు నిర్వహణ, రెవెన్యూ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. వర్షాలవల్ల మరణించిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం అందించాలన్నారు. మరో రెండుమూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
అకాల వర్షాల వల్ల మృతి చెందిన కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. సచివాలయంలో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. నష్టపోయిన రైతులు, పశువులు కోల్పోయిన వారిని, ఇళ్లను కోల్పోయిన వారిని ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆదుకుంటుందని తెలిపారు. బాధితులను ఆదుకోవడంతో పాటు పిడుగుపాడు, వడగండ్లు, భారీ వర్షాల వల్ల మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించనున్నారు.
రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, రైతులు భయపడాల్సిన అవసరం లేదని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. సోమవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వర్షాల కారణంగా ఆరుగురు మృతి చెందారన్నారు. అనంతపురంలో ఇద్దరు, కర్నూలులో ఇద్దరు, కడప జిల్లాలో ఇద్దరు మృతి చెందినట్లు తెలిపారు.