ఘోర రోడ్డ ప్రమాదం: ఆరుగురు మృతి, ఏడుగురికి తీవ్రగాయాలు
జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 6గురు మహిళలు మృతిచెందారు. కొత్తపేట మండలంలోని మోడేకుర్రు వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొంది.
తూర్పుగోదావరి: జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తపేట మండలం మూడేకర్రు మహాలక్ష్మీనగర్ వద్ద శనివారం తెల్లవారుజామున లారీ, ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా మహిళలే.
అల్లవరానికి చెందిన సుమారు 13 మంది ఆత్రేయపల్లి మండలంలోని వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి బయల్దేరారు. మార్గ మధ్యంలో ఓ లారీ వేగంగా వచ్చి వీరి ఆటోను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా మరొకరు మార్గమధ్యంలో మృతి చెందారు. ప్రమాదంలో గాయపడిన మరో ముగ్గురిని అమలాపురంలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
మృతులను చీకట్ల నాగమణి(46), పేరాబత్తుల అనంతలక్ష్మి(40), పి.భవాని(25), పులిమి అనంతలక్ష్మి(40), పి.పార్వతి(48), పి.దుర్గ(60)గా గుర్తించారు. రావులపాలెం సీఐ బి.పెద్దిరాజు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ ప్రమాదం కారణంగా అమలాపురం-రావులపాలెం రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి.