భారతీయులంతా వస్తున్నారా?: అమెరికా అధికారి వ్యంగ్యం, మరో 6గురికి షాక్
హైదరాబాద్: భారతీయులు అందరూ అమెరికాకు వస్తున్నారా? అని అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలుగు విద్యార్థులను వ్యంగ్యంగా ఆడుగుతున్నారట. ఇటీవల పలువురు విద్యార్థులను అమెరికా అధికారులు వెనక్కి తిప్పి పంపిస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా, మరో ఆరుగురు విద్యార్థులు ఆదివారం అర్ధరాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. టికెట్ డబ్బులు చెల్లించాలంటూ వారిపై శంషాబాద్లో ఓ విమానయాన సంస్థ ఒత్తిడి చేసింది. చివరకు సోమవారం తెల్లవారుజామున వారిని బయటకు పంపించారు.
ఓ విద్యార్థి మాట్లాడుతూ... న్యూయార్క్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు విద్యార్థులకు నరకం చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనతో పాటు నలుగురు విద్యార్థులను ఒక గదిలో వేసి రోజంతా తిండి పెట్టలేదన్నాడు. దాహం వేస్తుందని అడిగినా నీరు ఇవ్వలేదని, తిరిగి వెళ్లిపోవాలని ఒత్తిడి చేశారని వివరించాడు.
కాగా, రెండు రోజుల క్రితం ఓ తెలుగు విద్యార్థిని అమెరికాలోని కాలిఫోర్నియా విమానాశ్రయం నుంచి వెనక్కి పంపించేశారు. ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లిన ప్రశాంత్ అనే విద్యార్థిని అమెరికా అధికారులు విమానాశ్రయం నుంచే తిరిగి పంపించేశారు. అమెరికా వెళ్లిన మరో 22 మంది తెలుగు విద్యార్థులకు అక్కడి అధికారులు న్యూయార్క్ నుంచి అంతకుముందు వెనక్కి పంపించిన విషయం తెలిసిందే.