రాజధానిగా విజయవాడ: నిజమైన 60 ఏళ్ల కల
విజయవాడ: విజయవాడ రాజధానిగా ప్రకటించాలనేది ఇప్పటది కాదని.. గత 60ఏళ్ల నుండి రాష్ట్ర రాజధానిగా విజయవాడ కావాలని ఈ ప్రాంతవాసులు కోరుకుంటూనే ఉన్నారు. మొదట తమిళవాడు రాష్ట్రం నుండి విడిపోయినప్పుడు విజయవాడ రాజధాని అవుతుందని అందరూ ఆశించినా.. రాజకీయ కుట్రలతో అది కర్నూలుకు వెళ్లిపోయింది.
ఐతే ఆనాడు రాజధాని ఏర్పాటుపై సీమాంధ్రలో పర్యటించిన జస్టిస్ వాంఛూ కమిటీ కూడా విజయవాడలో రాజధాని ఏర్పాటుకు సిఫార్సు చేసింది. ఐతే అదీ నెరవేరలేదు. 60 ఏళ్ల తర్వాత ఈ కల నిజమైనందుకు కృష్ణా జిల్లాలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. సీమాంధ్ర జిల్లాల్లో విశాఖ తర్వాత అతి పెద్ద నగరమైన విజయవాడ రాజధాని ఏర్పాటుకు అన్ని విధాలా ఉపకరిస్తుందని రాజధానిగా విజయవాడనే ఎంపిక చేశారు. రైలు, జల, రోడ్డు, రవాణా మార్గాల ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అనుసంధానమైంది.
విజయవాడకు ఒకవైపున గుంటూరు, తెనాలి పట్టణాలు 35 కిమీ దూరంలో ఉన్నాయి. మరోవైపు 50 కిమీ దూరంలో ఏలూరు ఉంది. కోల్ కత్తా, చెన్నై, హైదరాబాద్, మచిలీపట్నంలను కలుపుతూ విజయవాడ నుండి జాతీయ రహదారులు, హౌరా-చెన్నై రైలు మార్గం, గన్నవరం విమానాశ్రయం అందుబాటులో ఉండటమే కాకుండా ఏడాది పొడవునా తాగునీటికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. 45 టిఎంసిల నీటిని నిలువచేసే పులిచింతల సమీపంలోనే ఉంది. పోలవరం పూర్తయితే ప్రకాశం బ్యారేజీకి 80 టిఎంసిల నీరు చేరుతుంది. ప్రధాన జాతీయ రహదారి ఆరు లైన్లుగా విస్తరించబడుతోంది.
విజయవాడ ఉడా పరిధిలో 7,060 చదరపు కిలోమీటర్లు కాగా రెండు కార్పొరేషన్లు, 20 మున్సిపాల్టీలు ఉన్నాయి. 50 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఆరు ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యశాలలు, విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఆసియాలోనే అతి పెద్ద బస్టాండ్ విజయవాడ సొంతం. ఒక్క విజయవాడ రైల్వేస్టేషన్ మీదుగా నిత్యం 300 రైళ్ల రాకపోకలు సాగుతున్నాయి. ఇన్ని అర్హతలున్న విజయవాడను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా ఎంపిక చేయడాన్ని కొంత మంది స్వాగతిస్తుంటే, మరికొంత మంది నిరసనలు తెలిపారు.