ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో ఏడేళ్ల బాలిక మృతి.. కేసు లేకుండా, పోస్టుమార్టం చేయకుండా రాజకీయ మంతనాలు??
రాజమండ్రి దివాన్ చెరువు వద్ద నున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో దారుణం జరిగింది. ఏడు సంవత్సరాల బాలిక పాఠశాల స్విమ్మింగ్ ఫూల్ లో పడి మృతిచెందింది. స్థానిక రాజకీయ నేతతో బంధుత్వం కలిగిన పాఠశాల యాజమాన్యం కేసు లేకుండా మంతనాలు సాగిస్తోంది. నష్టపరిహారం ఇస్తామంటూ ఆ బాలిక కుటుంబానికి నగదును ఆశగా చూపిస్తోంది.
బుడి బుడి అడుగులతో బంగారు భవిష్యత్తును ఎదుర్కొంటూ ముచ్చ టైన మాటలతో 10 రోజుల క్రితమే కోరుపల్లి ఓజశ్రీ ( 7 ) ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఎల్కేజీలో చేరింది. శనివారం సాయంత్రం స్కూల్ బస్ ఎక్కుతున్న సమయంలో ఓజశ్రీ స్విమ్మింగ్ పూల్లో పడి అపస్మారక స్థితిలోకి వెళ్లింది.
వెంటనే ప్రాథమిక చికిత్స చేసి ఆసుపత్రికి పంపించాల్సిన పాఠశాల యాజమాన్యం ఎటువంటి ప్రాథమిక చికిత్స చేయకుండానే ఆసుపత్రికి పంపించడంవల్లే తమ పాప మృతిచెందాల్సి వచ్చిందంటూ ఓజశ్రీ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఓజశ్రీ తల్లిదండ్రులు హైదరాబాదులో సాఫ్ట్ వేరు దంపతులు. 10 రోజుల క్రితమే రాజమండ్రి వచ్చిన వారిద్దరూ పాపను బంధువుల సంరక్షణలో ఉంచి హైదరాబాద్ వెళ్లారు.
రాజానగరంలోని జిఎస్ఎల్ హాస్పటల్లో ఓజశ్రీ ఈ లోకాన్ని విడిచింది. కేసు లేకుండా, పోస్టుమార్టం జరపకుండా బాధితులకు నష్ట పరిహారం ఇచ్చేలా మంత్రాంగం జరుగుతోందని ఇన్నిస్ పేట కో-ఆపరే టివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కోళ్ళ అచ్యుత రామయ్య మీడియాకు తెలిపారు. . సమాచారం అందుకున్న బొమ్మూరు పోలీసులు విచారణ జరుపుతున్నారు. పాఠశాల యాజమాన్యం తప్పుందని తేలితే వెంటనే అరెస్ట్ చేస్తామని సిఐ లక్ష్మణ్ రెడ్డి తెలిపారు.