ఏపీలో కొత్తగా వందలోపే కరోనా కేసులు: ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే..?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రమంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. వరుసగా మూడో రోజు కూడా ఏపీలో వందలోపు కరోనా కేసులు నమోదయ్యాయి. అంతకుముందు కూడా పలుమార్లు వందలోపే కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా, రాష్ట్రంలో 73 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
ఏపీలో కొత్తగా 73 కరోనా కేసులు
తాజా 73 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,88,423కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో కరోనాతో ఏ ఒక్కరూ కూడా మరణించలేదు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 7159గా ఉంది.
ఏపీలో యాక్టివ్ కేసులు 1003
ఒక్క రోజు వ్యవధిలో 82 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారినుంచి కోలుకున్నవారి సంఖ్య 8,80,261కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1003 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,33,45,522 కరోనా నమూనాలను పరీక్షించినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
ఏపీ జిల్లాల వారీగా కరోనా కేసులు
ఏపీలో జిల్లాలవారీగా నమోదైన కొత్త కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 3, చిత్తూరులో 14, తూర్పుగోదావరిలో 3, గుంటూరులో 15, కడపలో 2, కృష్ణాలో 12, కర్నూలులో 3, నెల్లూరులో 8, ప్రకాశంలో 1, శ్రీకాకుళంలో 3, విశాఖపట్నంలో 8, విజయనగరంలో ఒక కేసు నమోదైంది. పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్క కేసూ నమోదు కాలేదు.
దేశంలో లక్షన్నరకు తగ్గిన యాక్టివ్ కేసులు
మరోవైపు దేశంలోనూ కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 6,95,789 నమూనాలను పరీక్షించగా.. 12,059 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,08,26,363కు చేరింది. కొత్తగా 11,805 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 1,05,22,601కు చేరింది.
ఒక్క రోజు వ్యవధిలో 78 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మరణాల సంఖ్య 1,54,996కి చేరింది. ప్రస్తుతం దేశంలో 1,48,766 యాక్టివ్ కేసులున్నాయి. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రయ కూడా వేగంగా జరుగుతోంది. గత 24 గంటల్లో 3,58,473 మంది కరోనా వ్యాక్సిన్ వేయించుకోగా.. ఇప్పటి వరకు టీకా తొలి డోసు అందినవారి సంఖ్య 57,75,322కు చేరింది.