పరీక్ష ఫెయిలవుతానేమోనని విద్యార్థి ఆత్మహత్య: కానీ, మంచి మార్కులతో పాస్
కృష్ణా: పదవ తరగతిలో మంచి మార్కులు రావేమో, ఫెయిల్ అవుతానేమో అనే సందేహంతో ఓ విద్యార్థి ఉరేసుకుని ప్రాణం తీసుకున్నాడు. తీరా ఫలితాలు చూస్తే అతను మంచి మార్కులతో పాసయ్యాడు. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలోని గొడవర్రు హరిజనవాడలో మంగళవారం చోటు చేసుకుంది.
ఈ సంఘటనపై స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గొడవర్రుకు చెందిన వెలిసెల వినయ్కుమార్ (16) కంకిపాడులోని సెయింట్ మేరీస్ స్కూల్లో పదవ తరగతి చదివి పరీక్షలు రాశాడు.
ఈ క్రమంలో మంగళవారం 11గంటలకు ఫలితాలు రావల్సి ఉండగా, తనకు మార్కులు తక్కువ వస్తాయేమోని, లేక ఫెయిల్ అవుతానేమోనని ఆందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో సుమారు ఉదయం 10గంటల సమయంలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తిరిగి ఇంటికి చేరుకున్న కుటుంబసభ్యులు.. విగతజీవిగా పడివున్న వినయ్ కుమార్ను చూసి బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు, పోస్ట్మార్టం నిమిత్తం వినయ్ మృతదేహన్ని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, వినయ్ పదో తరగతిలో పాసవ్వడమే కాకుండా మంచి మార్కులతో పదికి 9 పాయింట్లు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.