కరోనా ఎఫెక్ట్: తిరుమల అలిపిరి వద్దే పెళ్లి చేసుకున్న జంట, పోలీసుల ఆశీర్వచనాలు
తిరుపతి: కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులు తమ పర్యటనలను వాయిదా వేసుకుంటున్నారు. విషయం తెలియక వచ్చినవారు వెనక్కి వెళుతున్నారు.
అలిపిరి వద్దే ఆపేశారు..
కాగా, శనివారం తిరుమలకు అనుమతించని కారణంగా అలిపిరి గరుడ విగ్రహం సాక్షిగా ఓ కొత్త జంట ఒక్కటైంది. తిరుమలలో వివాహం చేసుకోవాలనే కోరికతో కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన ఓ జంట బంధువులతో కలిసి శనివారం తిరుపతికి చేరుకున్నారు. తిరుమలకు వెళ్లేందుకు అలిపిరి వద్దకు చేరుకోగా.. పోలీసులు అనుమతించలేదు.
గరుడుడి సమక్షంలో పెళ్లి.. పోలీసుల ఆశీర్వచనాలు...
ఈ క్రమంలో అలిపిరి వద్దే గరుడుడి విగ్రహం ఎదుట వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. విగ్రహం ముందున్న రోడ్డుపైనే వరుడు వధువు మెడలో తాళి కట్టాడు. మూడు ముళ్ల బంధంతో ఏకమయ్యారు. కాగా, అక్కడే విధులు నిర్వహిస్తున్న తిరుపతి డీఎస్పీలు నాగ సుబ్బన్న, మురళీకృష్ణ, ఇతర పోలీసు సిబ్బంది ఆ కొత్త జంటకు ఆశీర్వాదాలు అందజేశారు.
ఏపీలో ఐదుకు చేరిన పాజిటివ్ కేసులు..
ఇది ఇలా ఉండగా, ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఐదుకు చేరింది. ఇప్పటి వరకు వైద్యులు 160 మంది నమూనాలను సేకరించారు. వారిలో 130 మందికి నెగిటివ్ వచ్చింది. మరో 25 మంది ఫలితాలు రావాల్సి ఉంది. ఇటీవలే విజయవాడకు విదేశాల నుంచి వచ్చిన ఓ యువకుడికి కరోనా పాజిటివ్ అని తేలడంతో అతడ్ని క్వారంటైన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అధికారులు అప్రమత్తమై అతడు నివసించిన ప్రాంతంలో పరిశీలించారు. అతడు ఎవరెవరిని కలిశాడని విషయంపై ఆరా తీస్తున్నారు.
Recommended Video
దేశంలో 324 పాజిటివ్ కేసులు.. ఆరు మరణాలు
కాగా, మనదేశంలోనూ కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు దేశంలో 324 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 22 రాష్ట్రాల్లో ఈ వైరస్ విస్తరించినట్లు భారత వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కారణంగా ఇప్పటి వరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోయార. ఢిల్లీ, కర్ణాటక, పంజాబ్, మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లో మరణాలు సంభవించాయి. కరోనా నియంత్రణలో భాగంగా ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు దేశ ప్రజలంతా జనతా కర్ఫ్యూలో పాల్గొన్నారు. దీంతో జన సంచారం లేకుండా రహదారులు మారిపోయాయి.