పాత చంద్రబాబును చూస్తారు: వ్యవస్థలను పరుగులు పెట్టిస్తా..!
Chandrababu Naidu: రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం.. పండగ వాతావరణంలో ఆరంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన తొలి కార్యక్రమం, అమలు చేసిన తొలి హామీ ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
కోలాహలంగా..
ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్వయంగా ప్రారంభించారు. రాజధాని అమరావతి పరిధిలోని పెనుమాకలో కొద్దిసేపటి కిందటే స్వయంగా అర్హులకు వాళ్ల ఇళ్ల వద్దే పింఛన్ మొత్తాన్ని అందజేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొన్నారు. మేళ తాళాలు, డప్పు చప్పుళ్లతో పెనుమాకలో కోలాహలం నెలకొంది.

నారా లోకేష్పై ప్రశంసలు
పింఛన్ల పంపిణీ అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు చంద్రబాబు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తొలి సభను తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టు ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో ఏర్పాటు చేశామని అన్నారు. గత ఎన్నికల్లో నారా లోకేష్ ఓడిపోయినా, గెలవాలనే తపనతో మంగళగిరి నుంచే పోటీ చేసి 91 వేలకు పైగా మెజారిటీని సాధించారని ప్రశంసించారు.
ప్రజల ముఖ్యమంత్రి..
అనంతరం నారా లోకేష్ మాట్లాడారు. గత అయిదు సంవత్సరాల్లో పరదాల ముఖ్యమంత్రిని చూశామని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ఇప్పుడు ప్రజల ముఖ్యమంత్రి మనం చూస్తోన్నామని వ్యాఖ్యానించారు. గతంలోలా పరిపాలన ఉండబోదని, ప్రజల కోసం పని చేసే ప్రభుత్వం వచ్చిందని అన్నారు.
లోకేష్- చంద్రబాబు డిబేట్
కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇంకా నెల రోజులు కూడా కానందున అధికారులు సెట్ కావడానికి ఇంకా టైమ్ పడుతుందని వేదికపై ఉన్న చంద్రబాబును ఉద్దేశించి నారా లోకేష్ అన్నారు. లేదు.. సెట్ అయ్యారు.. అని చంద్రబాబు సమాధానం ఇచ్చారు. ఇంకా పరదాలు కడుతున్నారు.. అని లోకేష్ బదులిచ్చారు.
ఆ అధికారులు సస్పెండ్ అవుతారు..
దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ.. పరదాలను కట్టే అధికారులను సస్పెండ్ చేస్తానని, ఇందులో మరో మాట ఉండబోదని హెచ్చరించారు. వాళ్లు ఏ కారణం చెప్పినా వినదలుచుకోలేదని, ఎవ్వరైనా కంప్లైంట్లు చేస్తే మాత్రం పనిష్మెంట్ తప్పదని స్పష్టం చేశారు.
చంద్రబాబు 4.0 అంటే ఏంటో చూస్తారు..#PensionsPandugaInAP #NTRBharosaPension #NaraLokesh #NaraChandrababuNaidu #AndhraPradesh pic.twitter.com/KNLF4itwQv
— Telugu Desam Party (@JaiTDP) July 1, 2024
మారడానికి నో టైమ్..
అయిదు సంవత్సరాలు అలవాటు పడ్డారని, మారడానికి టైమ్ పడుతుందని నారా లోకేష్ చెప్పగా.. అందరూ కొత్త శకానికి, కొత్త కల్చర్కు అందరూ అలవాటు పడాల్సిందేనని, ఇక టైమ్ ఉండదని చంద్రబాబు చెప్పారు. ఇన్ని రోజులు రివర్స్ పోయిన బండిని పాజిటివ్లో నడిపిస్తోన్నామని, స్పీడ్ పెంచడమే తప్ప వెనక్కి వెళ్లేది ఉండదని అన్నారు.
నువ్వు కుర్రాడివి..
వెనక్కి వెళ్లాలనే ఆలోచనే రాకూడదని, లేకపోతే ఒక షాక్ ట్రీట్మెంట్ ఇస్తే అందరూ సెట్ అవుతారని చంద్రబాబు తేల్చి చెప్పారు. షాక్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని, తనలో 95వ సంవత్సరం నాటి చంద్రబాబును చూస్తారని అన్నారు. 4.0లో 95 అంటూ వ్యాఖ్యానించారు. అప్పుడు నువ్వు కుర్రాడివి నీకు తెలియదు అని లోకేష్ను ఉద్దేశించి చెప్పారు.
రాష్ట్రం అలర్ట్..
1995లో తాను హైదరాబాద్లో బయలుదేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం అలర్ట్ అయిపోయేదని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు అంత భయంకరంగా చేయను గానీ తప్పు చేస్తే మాత్రం ఎవ్వరినీ వదిలిపెట్టను. అందరూ తమ మైండ్ సెట్ మార్చుకోవాలి.. అని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications