ఘోరం: బాలికపై నలుగురు గ్యాంగ్రేప్, హత్య చేసి చెరువులో పడేశారు
విజయనగరం జిల్లాలోని సీతానగరం మండలం గదివలసలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
విజయనగరం: జిల్లాలోని సీతానగరం మండలం గదివలసలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను హత్య చేసి గ్రామ సమీపంలోని చెరువులో పడేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక పాఠశాలలో చదువుతున్న ఓ బాలిక శుక్రవారం మధ్యాహ్నం భోజనానికి తన స్వగ్రామమైన బొబ్బిలి మండలం రెడ్డియ్యవలస గ్రామానికి వెళ్తుండగా మార్గం మధ్యలో అదే గ్రామానికి చెందిన నలుగురు యువకులు అడ్డుకున్నారు.
గాదెలవలస సమీపంలోని టేకు తోటలోకి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం బాలికను హత్య చేసి సమీపంలోని చెరువులో పడేసి పరారయ్యారు. ఘటన స్థలానికి బొబ్బిలి డీఎస్పీ సౌమ్యలత, సీఐ గోవిందరావు, సీతానగరం సీఐ సాయికృష్ణ చేరుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, బాధితురాలి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించడం అక్కడున్న వారిని కలిచివేసింది.
అనుమానంతో కన్న కూతుళ్లను చంపేసిన దుర్మార్గుడు
నెల్లూరు: జిల్లాలోని అనంతసాగరం మండలం కామిరెడ్డిపాడులో దారుణం చోటుచేసుకుంది. భార్య మీద అనుమానంతో ఎస్టీ కాలనీకి చెందిన నల్లు పెంచులయ్య అనే వ్యక్తి తన ముగ్గురు పిల్లలను బావిలోకి తోసేశాడు. వీరిలో హరిత(8), కీర్తన(7) మృతి చెందగా.. నాలుగేళ్ల హేమకుమారి ఆత్మకూరులోని వైద్యశాలలో మృత్యువుతో పోరాడుతోంది.
ఏడాది కిందట నల్లు పెంచులయ్య ఉపాధి కోసం కువైట్ వెళ్లాడు. అతడి భార్య భాను ఇక్కడి ఎస్టీ కాలనీలోని మరోవ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలుసుకున్నాడు. దీంతో గత గురువారం కామిరెడ్డిపాడు వచ్చాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. భర్త వల్ల ప్రాణాపాయం ఉందని భావించిన భాను ఇంట్లోంచి పరారైంది.
ఈ క్రమంలో శుక్రవారం మద్యం తాగి వచ్చిన పెంచులయ్య తన ముగ్గురు పిల్లలకు పురుగుమందు తాగించాడు. ఆ తర్వాత వారిని బావిలోకి తోసేశాడు. ఆపై తానూ ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు పెంచులయ్యను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.